వచ్చాడు… వచ్చాడు… టీడీపీకి అల్టర్నేటివ్ నాయకుడొచ్చాడు

స్వతహగా తనకి ఇష్టం లేదు… తల్లికి కూడా ఇష్టం లేదు… కానీ తండ్రి కోరిక మేరకు ఆయన ప్రోద్బలం కారణంగా ఆ యువకుడు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు, అతను భాషను గేలి చేశారు… అతని నడతను తప్పుబట్టారు… అతని ప్రవర్తనను కూడా ఎత్తి చూపారు… అతని క్యారెక్టర్‌ పై చెడు ప్రచారం చేశారు… చివరికి అతని సమర్ధతను కూడా తక్కువ చేసి చూపించి పప్పు అనే ముద్ర వేశారు. అన్నింటినీ తట్టుకున్నాడు… రాటు తేలాడు… సరిగ్గా లెక్కేసి కొడితే పదిహేను సంవత్సరాలు తిరిగే సరికి రాజకీయ ప్రత్యర్ధులకు ఏకు మేకై కూర్చున్నారు.

ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అర్ధమయ్యే ఉంటుంది. వేరే ఎవరి గురించో కాదు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నలభై అదు సంవత్సారాల వయసు గల తెలుగుదేశం పార్టీని తన కనుసన్నల్లో నడిపిస్తున్న ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, విద్యా శాఖా మాత్యులు నారా లోకేష్‌ గురించే. ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చదువులు ముగించుకుని అందరిలాగే ఇండియా వచ్చి తమ కుటుంబ వ్యాపార సంస్ధ అయిన హెరిటేజ్‌ లో చేరిపోయారు లోకేష్‌. తను హెరిటేజ్‌ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఆ సంస్ధకు సంబంధించిన రిటైల్‌ ఔట్ లెట్లను ఇబ్బడిముబ్బడిగా పెంచాడు. హెరిటేజ్‌ కంపెనీకి కార్పొరేట్‌ లుక్‌ తీసుకు వచ్చాడు. అది తల్లి భువనేశ్వరి కోరిక స్టాన్‌ఫర్డ్‌ లో చదివిన తన కుమారుడు రాజకీయాల రొంపిలోకి దిగకుండా మంచి వ్యాపారవేత్తగా ఎదగాలనేది నారా భువనేశ్వరి ఆలోచన. నారా లోకేష్‌ కూడా అదే ఆలోచనలతో తన కెరీర్‌ ప్రారంభించారు. అయితే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లు తండ్రి నారా చంద్రబాబునాయుడు మాత్రం తన రాజకీయ వారసత్వం కొడుకు నారా లోకేష్‌ అందుకోవాలని ఆశపడ్డారు. ఈ క్రమంలో 2009 సార్వత్రిక ఎన్నికల ముందు కుమారుడు లోకేష్‌ కి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చి రాజకీయాల్లోకి లాక్కొచ్చారు. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసి అవగాహన పెంచుకునే అలవాటు ఉన్న నారా లోకేష్‌ కుప్పం వరకూ తన బాధ్యతలను సక్రమంగానే నిర్వర్తించారు. కానీ ఆ ఎన్నికల్లో కూడా టీడీపీ ఓడిపోయి ప్రతిపక్షానికే పరిమితమై పోయింది. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అవ్వడంతో లోకేష్‌ తెరవెనుక టీడీపీ కోసం పనిచేయడం ప్రారంభించారు.

వరుసగా రెండు పర్యాయాలు ఓటమి చవిచూసిన టీడీపీ పార్టీకి జవసత్వాలు తీసుకురావాలని చంద్రబాబు నాయుడు 2012లో పాదయాత్ర నిర్వహించారు. అదే సమయంలో లోకేష్‌ తనకంటూ ఒక ప్రత్యేక బృందాన్ని తయారు చేసుకున్నారు. బ్యాంక్‌ ఎండ్‌ లో పాదయాత్రను పర్యవేక్షిస్తూనే పార్టీ వ్యవహరాలపై దృష్టి పెట్టారు. చంద్రబాబు పాదయాత్ర పూర్తయ్యే సమయానికి చాపకింద నీరులా పార్టీలో తన ప్రాధాన్యతను పెంచుకుని టీడీపీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్‌ భవన్‌ లో అడుగు పెట్టాడు నారా లోకేష్‌. క్రమక్రమంగా పార్టీలో తన పాత్రను విస్తృతం చేసుకుంటూ మీడియాకు కూడా దగ్గరై రాజకీయాలను అవుపాసన పట్టాడు. 2013లో జరిగన మహానాడులో కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా టీడీపీ క్రియాశీలక సభ్యత్వం తీసుకునన ప్రతి కార్యకర్తకు జీవిత భీమా వర్తించేలా చేశాడు. దీంతో పార్టీ శ్రేణులు, యువ నాయకులు లోకేష్‌ కి దగ్గరవ్వడం ప్రారంభించారు.

ఈ దశలో 2014లో రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలకు వేరు వేరుగా ఎన్నికలు జరిగాయి. సరిగ్గా ఇక్కడే లోకేష్‌ తన స్టాన్‌ఫర్డ్‌ అనుభవాన్ని రంగరించి ఎన్నికల బాధ్యత తలకెత్తుకున్నాడు. అప్పుడు ఉన్న పరిస్ధితుల్లో జగన్మోహన్‌ రెడ్డి అనే వ్యక్తి ప్రభావం రాష్ట్రం మీద విపరీతంగా ఉంది. ఆ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీనే అధికారంలోకి వస్తుందని మేధావులంతా అంచనా వేశారు. కానీ లోకేష్‌ మాత్రం టీడీపీ 104 సీట్లలో గెలుపొంది అధికారంలోకి వస్తుందని ఘంటా పధంగా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే కొంచెం అటూ ఇటూలో టీడీపీ 102 స్ధానాల్లో గెలుపొందగా టీడీపీ రెబల్‌ అభ్యర్ధి వర్మ పిఠాపురం నుంచి గెలుపొందారు. లోకేష్‌ అంత యాక్యురేట్‌ గా చెప్పగలగడానికి కారణం ఆంధ్రప్రదేశ్‌ ని ప్రతి మండలంలో ఎన్నికలకు రెండు నెలలకి ముందే నలుగురైదుగురు విద్యావంతులను నియమించి వారి ద్వారా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించి సర్వే నివేదికల అనుగుణంగా స్ట్రేటజీలు మార్చి ఎమ్మెల్యే అభ్యర్ధులను ఎప్పటికప్పుడు అలర్ట్‌ చేసి పార్టీని విజయం దిశగా నడిపించాడు. ఆ సంవత్సరం ఎన్నికల ఫలితాలు వెలువడి టీడీపీ విజయం సాధించే వరకూ పార్టీలో చాలా మందికి అధికారంలోకి వస్తామనే నమ్మకం లేదు.

ఇక 2016లో ఎమ్మెల్సీగా ఎన్నికై ఆంద్రప్రదేశ్‌ మంత్రివర్గంలో ఐటీ, పంచాయితీ రాజ్‌ శాఖల మంత్రిగా తనదైన ముద్ర వేశారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో గడచిన 40 సంవత్సరాలుగా టీడీపీ గెలుపు రుచి చూడని మంగళగిరి నియోజకవర్గం ఎంచుకుని వైఎస్‌ఆర్సీపీ సునామీలో ఓటమి పాలయ్యారు. అయితే ఓటమితో నిరుత్సాహ పడకుండా మంగళగిరినే అంటిపెట్టకుని ఉండి అక్కడి ప్రలతో మమేకమయ్యారు. తనకంటూ ఒక స్ట్రాంగ్‌ ఓట్‌ బేస్‌ ను మంగళగిరిలో తయారు చేసుకున్నారు. దీనితో పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు దగ్గరయ్యాడు. చంద్రబాబు తరువాత టీడీపీకి ఆల్టర్నేటివ్‌ నాయకుడిగా ఎదిగాడు. వితిన్‌ ది పార్టీ తనకు ఎదురు లేకుండా చేసుకున్నాడు. ఇది రాజకీయంగా లోకేష్‌ సాధించిన మొట్టమొదటి విజయం. ఇదే ఊపులో 2024 ఎన్నికల్లో కూటమి సునామీలో మంగళగిరి నుంచి రికార్డు మెజార్టీతో గెలుపొందాడు. ప్రస్తుతం ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, విధ్యా శాఖల మంత్రిగా తన సత్తా చాటుకుంటున్నాడు. తాను నిర్వర్తిస్తున్న శాఖలనే కాకుండా సీయం పేషీతో సహా ఇతర మంత్రిత్వ శాఖలన్నింటినీ తన కనుసన్నల్లో నడుపుతున్నాడు. ప్రభుత్వంపైనా బ్యూరోక్రసీపైనా, పోలీసు యంత్రాంగంపైనా తిరుగులేని పట్టు సాధించాడు. తాను పాదయాత్రలో రాసుకున్న రెడ్‌ బుక్‌ ని నిర్ధాక్షిణ్యంగా, నిర్ధ్వందంగా అమలు చేస్తున్నాడు. ప్రత్యర్ధి పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు.

ఇదంతా ఒకెత్తైతే జాతీయ స్ధాయిలో కూడా నారా లోకేష్‌ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఫెడరల్‌ సిస్టమ్‌ లో రాష్ట్రాలకు ఎంతగా స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పని సరిగా కావాలి. కేంద్రంతో సత్సంబంధాలు నెరపడం అనేది రాజకీయాల్లో చాలా ముఖ్యమైన వ్యవహారం. దీన్ని గ్రహించిన నారా లోకేష ఈ మధ్య కాలంలో తరచు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులతో పాటు, హోంమంత్రి అమిత్‌ షా, ప్రధాని మోడీలను కూడా మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఈ క్రమంలో లోకేష్‌ ప్రధాని మోడీ దృష్టిలో పడినట్లే కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రాజధాని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో కానీ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు శనివారం విశాఖలో జరిగిన యాగాంధ్ర కార్యక్రమంలో కానీ లోకేష్‌ గురించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అతని సమర్ధతను ప్రస్తుతించారు.

మొత్తం మీద ఇష్టం లేకుండా వచ్చినా దేశంలో రాహుల్‌ గాంధీ తరువాత సోషల్‌ మీడియాలో అంతగా ట్రోల్‌ కి గురైనా ఓరిమి గల పసరుకు తేటనీరు అన్నట్లుగా ఇప్పుడు నారా లోకేష్‌ ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రన్ని శాసిస్తున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Politent News Web 1

Politent News Web 1

Next Story