Lokesh Slams YSRCP Leaders: హోంమంత్రి అనితపై వైకాపా నేతలు చేసిన అవమానకరమైన, మహిళా ద్వేషపూరిత వ్యాఖ్యలు ఆ పార్టీ నిజ స్వరూపాన్ని బహిర్గతం చేస్తున్నాయని మంత్రి నారా లోకేశ్‌ తీవ్రంగా విమర్శించారు.

ఐదేళ్ల వైకాపా పాలనలో శాంతిభద్రతలు, అభివృద్ధి వంటి అంశాలపై సమాధానం లేదని, అందుకే వారు తమ సాంప్రదాయిక పద్ధతులైన దూషణలు, బెదిరింపులు, మహిళా ద్వేషం, కులపరమైన దాడులకు పాల్పడుతున్నారని లోకేశ్‌ మండిపడ్డారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక మహిళను, దళిత నాయకురాలిని లక్ష్యంగా చేసుకోవడం సాధారణ ఘటన కాదని స్పష్టం చేశారు.

ఇది వైకాపా ఆధ్వర్యంలో పెంచి పోషించిన విషపూరిత రాజకీయ సంస్కృతిని ప్రతిబింబిస్తోందని లోకేశ్‌ అన్నారు. హోంమంత్రి అనిత కష్టపడే తత్వానికి, ధైర్యానికి, ప్రజాసేవకు నిదర్శనమని ప్రశంసించారు. వైకాపా నాయకులు ఎంతగా దూషించినా ఆమె సాధించిన విజయాలను తగ్గించలేరని, ఆమె గొంతు నొక్కలేరని ఆయన హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలాంటి ద్వేషపూరిత రాజకీయాలను పదే పదే తిరస్కరించారని గుర్తు చేశారు. అనితతో పాటు ప్రతి మహిళకు, ప్రతి దళితుడికి వైకాపా క్షమాపణ చెప్పాలని మంత్రి నారా లోకేశ్‌ డిమాండ్ చేశారు.

Next Story