కేంద్రాన్ని కోరిన లోకేష్

National Skill Training Institute in Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రి జయంత్ చౌదరిని సోమవారం కలుసుకున్నారు. ఈ భేటీలో విశాఖపట్నంలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (నేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ - NSTI) ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ జయంత్ చౌదరిని కోరారు.

విశాఖపట్నం జిల్లాలోని పెదగంట్యాడలో ఈ సంస్థ కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 5 ఎకరాల భూమిని కేటాయించినట్లు లోకేష్ జయంత్ చౌదరి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సంస్థ స్థాపన ద్వారా అధ్యాపకుల అభివృద్ధి, పరిశ్రమలతో అనుసంధానమైన నైపుణ్య శిక్షణ, గ్రీన్ స్కిల్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో ప్రాంతీయ కేంద్రంగా పనిచేస్తుందని, దీనివల్ల జాతీయ నైపుణ్య వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని ఆయన వివరించారు.

అదనంగా, రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET-AP) ద్వారా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (NCVET) అర్హతలను విస్తృతంగా అమలు చేయడానికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ భేటీలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మరియు కొందరు ఎంపీలు పాల్గొన్నారు.

మరోవైపు, మంత్రి నారా లోకేష్ పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. త్వరలో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో విద్యా, ఐటీ రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరపనున్నారు.

ఈ భేటీలు ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధి మరియు విద్యా రంగాల అభివృద్ధికి కీలకంగా మారనున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story