Lokesh–Western Sydney University: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ను సందర్శించారు. అక్కడ యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, వ్యవసాయ సాంకేతికత పరిశోధకులతో భేటీ అయ్యి, రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్ధిపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో వ్యవసాయ ఆధునీకరణకు, ప్రెసిషన్ ఫార్మింగ్‌లో నైపుణ్యాలను అచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని లోకేశ్ సూచించారు. రైతులు, వ్యవసాయ వృత్తిపరులకు స్మార్ట్ ఫార్మింగ్ టెక్నిక్‌లు, అగ్రి-టెక్ ఇన్నోవేషన్‌లలో శిక్షణ అందించే సంయుక్త కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

ఏపీ విశ్వవిద్యాలయాలతో స్థిరమైన నీటి నిర్వహణ, ఇతర ప్రాజెక్టులపై సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, ఏఐ ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను ప్రోత్సహించే ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని లోకేశ్ కోరారు. మరోవైపు, ఆస్ట్రేలియా సముద్ర ఉత్పత్తుల పరిశ్రమ ప్రతినిధులతో కూడా సమావేశమై, ఏపీ-ఆస్ట్రేలియా మధ్య ఆక్వా ఎగుమతుల అవకాశాలపై చర్చించారు. ఈ రంగం అభివృద్ధికి అందరూ చేతులు కలిపాలని మంత్రి పిలుపునిచ్చారు.

Next Story