Minister Nara Lokesh: కొరియా పెట్టుబడులకు ఆహ్వానం: ఏపీలో స్థిరమైన వాతావరణం – మంత్రి నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh: దక్షిణ కొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగ శాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్తో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సియోల్లో కీలక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న 3S (స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్) విధానం కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంగా నిలుస్తుందని తెలిపారు. భారత్లో ఆంధ్రప్రదేశ్ను అత్యంత స్థిరమైన, నమ్మకమైన పెట్టుబడి కేంద్రంగా మార్చేందుకు కొరియా పరిశ్రమలను ప్రోత్సహించాలని వారిని కోరారు.
ఏపీలో అందుబాటులో ఉన్న పన్ను రాయితీలు, తక్కువ ధరలో భూమి, వివిధ సబ్సిడీలు పెట్టుబడిదారులకు పెద్ద మద్దతుగా ఉంటాయని లోకేశ్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు తీరంలో సురక్షితమైన, నమ్మకమైన, స్నేహపూర్వక ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని పేర్కొన్నారు. దీంతో ప్రపంచ సప్లై చైన్ నష్టాలను కూడా తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
కేవలం భారీ పరిశ్రమలే కాకుండా గ్రీన్ ఎనర్జీ, వినియోగ వస్తువులు, మోడరన్ రిటైల్, టూరిజం, అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో కొరియా పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వాగతం పలుకుతోందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
ఈ పర్యటన ఐదో రోజు సందర్భంగా జరిగిన సమావేశం ఏపీ – దక్షిణ కొరియా మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందడుగుగా భావిస్తున్నారు.

