సౌదీలో చిక్కుకున్న ధర్మవరం యువకుడ్ని రక్షించిన మంత్రి
మంత్రి సత్యకుమార్ చొరవతో స్వదేశానికి వచ్చిన ఫరూక్

ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లి తీవ్ర సంక్షోభంలో చిక్కుకుకుపోయిన ధర్మవరం యువకుడు సయ్యద్ ఫరూక్ అనే వ్యక్తి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. పుట్టపర్తికి చెందిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ద్వారా డ్రైవర్ ఉద్యోగం కోసం నమ్మి సౌదీ వెళ్లిన ఫరూక్ తో అక్కడ బలవంతపు గృహ పనులు చేయించేవారు. అంతేకాకుండా ఆహారం, నివాసం ఏర్పాటు చేయకపోవడంతో పాటు జీతాలు కూడా ఇవ్వక పోవడంతో నరకయాతన అనుభవించారు. వెట్టి చాకిరీ చేయించడంతో తీవ్ర మానసిక, శారీరక వేదనకు గురయ్యాడు. ఈ పరిస్ధితిని ధర్మవరం నియోజకవర్గ ఇంఛార్జ్ హరీష్ బాబుకు వీడియో కాల్ చేసి ఫరూక్ మొరపెట్టుకున్నాడు. ఫరూక్ బాధలు విని చలించిపోయిన హరీష్ విషయాన్ని వెంటనే మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకు వెళ్ళారు. మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రి సత్యకుమార్ వెంటనే కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ కి ఫరూక్ విషయంలో లేఖ రాశారు. ఫరూక్ ప్రాణానికి రక్షణ కల్పించాలని, అతని పాస్ పోర్ట్ తిరిగి అందజేయాలని, భారత రాయబార కార్యాలయం ద్వారా స్వదేశానికి రప్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రిని సత్యకుమార్ కోరారు. సత్యకుమార్ అభ్యర్ధనతో స్పందించిన విదేశాంగ శాక అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుని ఫరూక్ ని ఈ నెల 22వ తేదీన స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చింది. ధర్మవరం వచ్చిన ఫరూక్ 23వ తేదీన ధర్మవరంలోని మంత్రి సత్యకుమార్ కార్యాలయానికి వచ్చి అక్కడి సిబ్బందిని కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫరూక్ ని మంత్రి సత్యకుమార్ తో కార్యలయ సిబ్బంది ఫోన్లో మాట్లాడించారు. మంత్రి సహకారం లేకపోతే తాను స్వదేశానికి తిరిగి వచ్చేవాడినే కాదని ఫరూక్ అన్నారు.
