N. Chandrababu Naidu: పిఠాపురంలో చోటుచేసుకున్న ప్రోటోకాల్ వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పార్టీ నాయకులు ఐక్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో సీఎం మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

ప్రోటోకాల్ పేరుతో ఫ్లెక్సీల్లో ఫొటోల ప్రాధాన్యం కోసం పార్టీ నేతలు పరస్పరం ఘర్షణ పడటం సరికాదని సీఎం మండిపడ్డారు. పిఠాపురం ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సమావేశం సందర్భంగా జరిగిన ఈ వివాదంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రవర్తన అనుచితమని అభిప్రాయపడ్డారు.

పార్టీ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇలాంటి సంఘటనలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ పెద్దలు లేదా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రత్యక్షంగా గొడవలకు దిగడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.

ఈ తరహా ఘటనలు కేడర్‌కు తప్పుదారి చూపుతాయని హెచ్చరిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు తగిన సూచనలు ఇవ్వాలని పల్లా శ్రీనివాసరావును సీఎం ఆదేశించారు.

పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత అత్యంత ముఖ్యమని, వ్యక్తిగత ప్రాధాన్యం కోసం పోటీ పడటం మానుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని ఆయన మరోసారి హెచ్చరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story