త్వరలో నారాలోకేష్ కి కీలక బాధ్యతలు
మనసులో మాట బయటపెట్టిన చంద్రబాబు

నారాలోకేష్… తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆక్సెప్టెన్సీ ఇప్పటికే పొందిన యువనేత. ఇప్పటికే అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనే అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగాలంటే పార్టీపై అపరిమితమైన పట్టు ఉండాలి. టీడీపీలో నారాలోకేష్ కి తిరుగులేదు… కానీ అధికారికంగా ముఖ్యమైన బాధ్యతలు నెరేవర్చడం… పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు స్వయంగా తీసుకునే అవకాశం కలగాలంటే పార్టీలో కీలక పదవి ఉండాలి. ఇప్పుడు టీడీపీలో ఆ ట్రాన్సఫరమేషనే జరుగుతోంది. వాస్తవానికి మహానాడులోనే లోకేష్ కు పార్టీలో పెద్ద బాధ్యతలు అప్పచెపుతారని ప్రచారం జరిగింది. కానీ అక్కడ ఉన్నది రాజకీయ చాణక్యడు నారా చంద్రబాబు నాయుడు. ఆయన రాజకీయంగా ఎప్పుడు ఏది చెయ్యాలో ఏ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే విషయాలపై విపరీతమైన పట్టు సాధించిన రాజకీయవేత్త. లోకేష్ కు ప్రమోషన్ కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎంత ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు అవునని కానీ కాదని కానీ ఒక్క మాట మాట్లాడలేదు. మహానాడులో లోకేష్ కు పార్టీలో పెద్ద బాధ్యతలు అప్పగిస్తూ ప్రకటన చేయాలని జిల్లాల నుంచి టీడీపీ శ్రేణులు తీర్మానాలు కూడా చేసి పంపాయి. మహానాడులో లెకేష్ కి సంబంధించి ఖచ్చితంగా ప్రకటన ఉంటుందని అందరూ ఊహించారు. కానీ అటువంటి ప్రకటన ఏదీ మహానాడు వేదికగా రాలేదు. దీంతో కార్యకర్తలు నిరాశలో మునిగిపోయారు.
అయితే ఇప్పుడు లోకేష్ భవిష్యత్తుపై ఆయన తండ్రి, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నర్మగర్భంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలో లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి అని ప్రశ్న రాగా చంద్రబాబు తనదైన రీతిలో స్పందించారు. అందుకు చాలా సమయం ఉందని మాట్లాడారు. నాయకుడిగా తన ముద్ర చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కష్టపడి పని చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించగలరని కూడా అభిప్రాయపడ్డారు. పార్టీలో లోకేష్ పాత్రను గుర్తు చేసేలా చంద్రబాబు వ్యాఖ్యానాలు సాగాయి. ఈ విషయంలో నేరుగా స్పష్టత ఇవ్వకపోయినా.. కష్టపడి పని చేయడం ద్వారా భవిష్యత్తులో లోకేష్ అందరి ఆమోదంతో నాయకత్వ బాధ్యతలు తీసుకుంటాడని మాత్రం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ దిశగా సంకేతాలు ఇచ్చారు.
చంద్రబాబు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. పార్టీలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తారు. పార్టీలో ఎటువంటి వ్యతిరేకత రాకుండా చూసుకుంటారు. లోకేష్ విషయంలో కూడా చంద్రబాబు ఆలోచన అదే. లోకేష్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి అభ్యంతరాలు ఉండేవి. ఆయన నాయకత్వం పై అప నమ్మకం ఎక్కువగా ఉండేది. కానీ వాటన్నింటినీ అధిగమించి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు నారా లోకేష్. అయితే ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చింది మాత్రం చంద్రబాబు. తండ్రి నుంచి సహనం, మంచి లక్షణాలను అలవరచుకున్నారు నారా లోకేష్. మరోవైపు పార్టీ శ్రేణుల అభిమానాన్ని కూడా చూరగొంటున్నారు. పార్టీలో పదవితో సంబంధం లేకుండా.. టిడిపిని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు నారా లోకేష్.మహానాడులో లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి విపరీతంగా వినిపించింది. ఇప్పుడు కాకుంటే ఎప్పుడు అని ఎక్కువమంది సీనియర్లు కూడా తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు. పార్టీలో విస్తృత చర్చ జరగాలని.. అందరి ఆమోదంతోనే లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్నది చంద్రబాబు అభిప్రాయం. అందుకే మహానాడు వేదికగా ఆ ప్రకటనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కుటుంబం నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. లోకేష్ కు పోటీ కూడా లేదు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ టీం తయారవుతోంది. చంద్రబాబు మాదిరిగానే నమ్మకస్తులైన యువ నేతలు లోకేష్ చుట్టూ ఇప్పుడు ఉన్నారు. అందుకే పార్టీ పగ్గాలు ముందుగా అప్పగించాలన్న డిమాండ్ వచ్చింది. అయితే పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లో బలమైన చర్చ నడిచింది. ఈ విషయంలో చంద్రబాబు వ్యూహం వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.
