అమరావతి ప్రాంతాన్ని ఉద్దేశించి మహిళలను కించపరుస్తూ సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణనలోకి తీసుకున్న కమిషన్, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఈ మేరకు ఎన్‌సీడబ్ల్యూ ఛైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు ఒక లేఖ రాశారు.అమరావతి ప్రాంతంలో ఉద్యమిస్తున్న మహిళలపై జర్నలిస్టు కృష్ణంరాజు అనుచితంగా మాట్లాడారంటూ వచ్చిన ఆరోపణలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది. అమరావతి ఉద్యమంలో మహిళా రైతులు ముందుండి కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా కమిషన్ గుర్తుచేసింది.ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి వివిధ మీడియా మాధ్యమాల్లో ప్రసారమైన కథనాలను ఆధారంగా చేసుకుని, ఎన్‌సీడబ్ల్యూ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించినట్లు తెలుస్తోంది. జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల విషయంలో ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ, మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని కమిషన్ ఛైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ ఆదేశించారు. కృష్ణంరాజు అమరావతిని 'వేశ్యల రాజధాని' అని వ్యాఖ్యానించడం తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. దీనికి సంబంధించిన కేసులో సాక్షి టీవీ న్యూస్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం తెలిసిందే.

Politent News Web 1

Politent News Web 1

Next Story