Chief Electoral Officer Vivek Yadav: ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయినా, 2026 జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన అర్హులైన ఓటర్లు అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. సరైన ప్రక్రియ లేకుండా ఒక్క అర్హుడైన ఓటరు పేరును కూడా తొలగించబోమని ఆయన హామీ ఇచ్చారు.

సచివాలయ ప్రాంగణంలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గైర్హాజరైనవారు, వేరే ప్రాంతానికి మారినవారు, మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓటర్ల జాబితాలను అన్ని గ్రామ పంచాయతీలు, పురపాలక కార్యాలయాలు, పోలింగ్‌ కేంద్రాల నోటీస్‌ బోర్డుల్లో ప్రదర్శించామని, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్‌ చేశామని తెలిపారు. సర్‌ వివరాలతో అనుసంధానం కాని లేదా వ్యత్యాసాలున్న ప్రతి ఓటరుకు నోటీసు ఇచ్చి విచారణ చేస్తామని, 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.

జూలై 31న ప్రచురించిన శాసనసభ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను పార్టీల ప్రతినిధులకు అందించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 3,72,02,684 కాగా, వీరిలో పురుషులు 1,82,69,019, మహిళలు 1,89,30,929, థర్డ్‌జెండర్‌ 2,736 మంది ఉన్నారు. ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇవ్వనివారు 44,89,512 మంది. వీరిలో మరణించినవారు 15,22,174, చిరునామా ఆచూకీ లేనివారు 14,43,888, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైనవారు 7,37,218, గుర్తించలేని చిరునామాలో 7,77,905 మంది ఉన్నారని వివేక్‌ యాదవ్‌ వివరించారు.

సమావేశం అనంతరం పార్టీ నేతలు విలేకర్లతో మాట్లాడారు. తెదేపా అధికార ప్రతినిధి పి.అశోక్‌బాబు, వైకాపా హయాంలో తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల్లో చేర్చిన డూప్లికేట్‌ ఓట్లు సర్‌ వడపోతలో తొలగించారని, అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలని కోరామని అన్నారు. ఆగస్టు 30 లోపు నోటీసులకు సమాధానమిస్తే విచారించి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారని తెలిపారు.

మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నాని, సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, భార్యాభర్తల ఓట్లు వేర్వేరు కేంద్రాల్లో ఉండకుండా ఒకే పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకురావాలని కోరామని అన్నారు. ఒకే వ్యక్తికి నరసరావుపేట, చిలకలూరిపేటల్లో ఓట్లు ఉన్నా తొలగించలేదని, బీఎల్‌ఓలపై ఒత్తిడి పెరిగిందని, సర్‌ను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

భాజపా జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు లంకా దినకర్, చిరునామా మారినవారు, చనిపోయినవారు, డూప్లికేట్‌, తొలగించిన ఓటర్ల జాబితాలను బూత్‌ల వారీగా, నియోజకవర్గాల వారీగా జిల్లాస్థాయి పార్టీలకు అందించాలని కోరామని, ఈ ప్రతిపాదనకు అధికారులు అంగీకరించారని తెలిపారు. సర్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబరు 3న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని అధికారులు చెప్పారు.

సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, ఒకే కుటుంబంలోని ఓట్లన్నీ ఒకే పోలింగ్‌ బూత్‌లో ఉండేలా చూడాలని, ఏఎస్‌డీడీగా గుర్తించిన 44 లక్షల మంది వివరాలు ఇవ్వాలని, బీఎల్‌ఓలపై ఒత్తిడి తగ్గించాలని కోరారు.

ఎన్నికల సంఘం సర్‌ ప్రక్రియను పారదర్శకంగా, అర్హులైన ఓటర్ల హక్కులు కాపాడే విధంగా నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story