జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో పవన్ కల్యాణ్ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల పలు సమస్యలు తలెత్తే అవకాశముందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కేబినెట్లో జనసేన నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. అందులో నాదెండ్ల మనోహర్ మినహాయిస్తే మిగిలిన ఇద్దరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు. ఇప్పుడు నాగబాబుకు కూడా పదవి ఇస్తే నలుగురిలో ముగ్గురు కాపు సామాజికవర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు ఇచ్చినట్లవుతుంది. అది పార్టీకి కొంత ఇబ్బందిగా మారుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. జనసేన అంటే ఒకే సామాజికవర్గానికి చెందిన పార్టీగా ముద్రపడటం ఇష్టంలేని పవన్ కల్యాణ్ నాగబాబుకు మంత్రి పదవి విషయంలో కొంత ఆలోచనలో పడినట్లు తెలిసింది. మరోవైపు కాపు సామాజికవర్గానికి చెందిన ఇద్దరికి టీడీపీ కూడా మంత్రి పదవులు ఇచ్చింది. పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు కూడా కేబినెట్లో ఉండటంతో ఎక్కువ మంది కాపులకు కేబినెట్లో అవకాశం ఇచ్చినట్లవుతుందన్న భావన కలుగుతుందని చంద్రబాబు నాయుడు కూడా పవన్తో చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు కేబినెట్లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. వంగవీటి రాధాను ఎమ్మెల్సీగా ఎంపిక చేయకపోవడానికి కూడా అదే కారణమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటే ఇంకా ఇబ్బందులు ఏర్పడతాయని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు తెలిసింది. పార్టీ కోసం కష్టపడిన నాగబాబుకు ముందు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అనుకున్నప్పటికీ ఇలాంటి డిస్కషన్స్ వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందని, జనసేనను ఒక సామాజిక వర్గానికి కట్టే ప్రయత్నం తామే చేసుకున్నట్లవుతుందని పవన్ కూడా నిర్ణయానికి వచ్చినట్లు కనపడుతుంది. అందుకే ఎమ్మెల్సీతో సరిపెడుతున్నారు. ముందుగా నాగబాబును రాజ్యసభకు పంపాలని అనుకున్నా, జనసేన తరపున లింగమనేనిని పంపాలని నిర్ణయించడంతో నాగబాబును ఎమ్మెల్సీగా ఎంపిక చేశారంటున్నారు. నాగబాబుకు మంత్రిపదవి ఇస్తే బీసీలతో పాటు మిగిలిన సామాజికవర్గాల్లో కూడా ఆలోచన బయలుదేరి పార్టీని దూరం పెట్టే అవకాశముందని భావించి పవన్ కల్యాణ్ ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. అయితే, పవన్ కల్యాణ్ ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే వెనక్కు తగ్గరన్న వాదన ఉంది. మరి నాగబాబు విషయంలో ఇన్నిసమస్యలు వచ్చి పడతాయని తెలిసినా పవన్ ముందుకు వెళతారా? లేదా? అన్నది మరో పది రోజుల్లో తెలియనుంది.
