కొమ్మినేని అరెస్టుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం
Outrage erupts over Kommineni's arrest

సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వృత్తిలో భాగంగా టీవీ ఛానెల్ డిబేట్లో పాల్గొన్నందుకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా కొమ్మినేనిని అరెస్ట్ చేయించారని తీవ్రస్థాయిలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలే కాకుండా... సామాజిక సంస్థలు కూడా ఏపీ సర్కారు తీరుపై మండిపడుతున్నాయి. జర్నలిజాన్ని భయపెట్టి మనుగడ సాగించలేరని హెచ్చరిస్తున్నాయి.
హైదరాబాద్లోని జర్నలిస్టు కాలనీలో నివసించే కొమ్మినేని శ్రీనివాస్ రావును గుంటూరు జిల్లా తూళ్లూరు పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశారు. ఉదయమే కొమ్మినేని ఇంటికి చేరుకున్న పోలీసులు.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు చెప్పి 70యేళ్ల వయసున్న ఆయనను అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ నుంచి సోమవారమే మంగళగిరి తీసుకెళ్లిన పోలీసులు.. ఇవాళ ఉదయం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొమ్మినేనిని మంగళగిరి కోర్టుకు తీసుకెళ్లారు. నిన్న హైదరాబాద్ నుంచి తీసుకెళ్లిన కొమ్మినేనిని సోమవారం రాత్రంతా నల్లపాడు పోలీస్స్టేషన్లోనే ఉంచారు. కొమ్మినేనిని ఆయన తరపు న్యాయవాదులు కలవకుండా అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరుపై లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అరెస్టును ఖండించిన జగన్ :
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తునని వైఎస్ జగన్ తెలిపారు. 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టును అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని కూటమి సర్కార్ పతాక స్థాయికి తీసుకెళ్లిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్లను డైవర్ట్ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారని జగన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా మారిపోయిందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలంగా చంద్రబాబునాయుడు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున ఎవ్వరూ గొంతెత్తకుండా కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
తన ఏడాది దుర్మార్గపు పాలన, మోసాలు, అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేశారన్నారు. ఈ చర్యతో కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. సహజంగా ఒక డిబేట్ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్కు ఏం సంబంధం? అని ప్రశ్నించారు.
