రాజ్యసభ సభ్యుడిగా పాకా ప్రమాణ స్వీకారం

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ ఢిల్లీ లో బుధవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ పాకా సత్యనారాయణతో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి రాజ్యసభ సీటు ఖాళీ ఏర్పడింది. కూటమి మిత్ర ధర్మం పాటించి ఖాళీ అయిన రాజ్యసభ సీటును బీజేపీకి ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది. దీంతో స్థానానికి పాకా సత్యనారాయణ పేరును బీజేపీ ప్రతిపాదించింది. ఈ స్ధానానికి వేరే ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో కూటమి అభ్యర్థిగా పాకా సత్యనారాయణ ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం రాజ్యసభ చైర్మన్ ఛాంబర్ లో పాకా సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు. ఈకార్యక్రమంలో బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, బీసీ మోర్చా జోనల్ ఇన్ ఛార్జ్ కారంకి శ్రీనివాసు తదితరులు పాకా సత్యనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.
