మంత్రి నారా లోకేశ్ తో భేటీ అయిన ప్రతినిధులు

Pilani Campus in Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బిట్స్‌ పిలానీ సంస్థ కొత్త క్యాంపస్ నిర్మాణ ప్లాన్లను శుక్రవారం ఐటీ, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్ మంత్రి నారా లోకేశ్ పరిశీలించారు. బిట్స్‌ పిలానీ ప్రతినిధులు మంత్రిని కలిసి వివరణాత్మక ప్లాన్లను చూపించారు.

క్యాంపస్‌లో నెక్స్ట్ జెనరేషన్ టెక్నాలజీలపై దృష్టి సారించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్, రోబోటిక్స్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి అధునాతన కోర్సులు అందుబాటులో ఉంటాయని ప్రతినిధులు తెలిపారు. రెండు దశల్లో నిర్మాణాలు పూర్తి చేసి, 7 వేల మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించేలా రూపొందిస్తున్నట్లు వివరించారు.

ఐదేళ్లలో రూ. 1000 కోట్ల పెట్టుబడులతో క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తామని బిట్స్‌ ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. గ్రీన్ బిల్డింగ్ సాంకేతికతలు, రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగం వంటి పర్యావరణ అనుకూల విధానాలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు.

అమరావతి బిట్స్‌ క్యాంపస్ దేశంలోనే మొదటి ఏఐ ఆధారిత క్యాంపస్‌గా రూపొందనుందని ప్రతినిధులు హామీ ఇచ్చారు. వ్యవసాయం, వాతావరణం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో కూడా సంబంధిత కోర్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

సాధ్యమైనంత త్వరగా క్యాంపస్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్ అధికారులు, ప్రతినిధులకు సూచించారు. ఈ క్యాంపస్ రాష్ట్రంలో ఉన్నత విద్య, టెక్నాలజీ అభివృద్ధికి కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story