ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు బెయిల్ మంజూరయ్యింది. ఈమేరకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. సినీ నటి జత్వానీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులుకు బెయిల్ వచ్చింది. అయితే, ఈ కేసులో బెయిల్ వచ్చినా పీఎస్ఆర్ ఆంజనేయులు మాత్రం జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే.. ఏపీపీఎస్సీలో అక్రమాల ఆరోపణలపై నమోదైన కేసులో కూడా పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఆ కేసులో కూడా బెయిల్ రావాల్సి ఉంది. దీంతో, ఆ కేసులో కూడా బెయిల్ వస్తే ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు జైలు నుంచి రిలీజ్ అవుతారు. అప్పటిదాకా ఆ కేసులో ఇంకా జైల్లోనే ఉండాల్సి ఉంది.
జత్వానీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై గత వారమే హైకోర్టు సీఐడీకి ప్రశ్నల వర్షం కురిపించింది.బెయిల్ మంజూరు చేస్తే ఆయన దర్యాప్తునకు ఎలా ఆటంకం కలిగిస్తారని ప్రశ్నించింది. సాక్షులను ఎలా ప్రభావితం చేయగలరో చెప్పాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలోనే ఇవాళ జరిగిన విచారణలో జత్వానీ కేసులో సీతారామాంజనేయులుకు బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు.. ఏపీపీఎస్సీ స్పాట్ వాల్యుకేషన్ కేసులో వచ్చేనెల 5వ తేదీ వరకు పీఎస్ఆర్ ఆంజనేయులుకు న్యాయస్థానం గత వారం రిమాండ్ను పొడిగించింది. అయితే, జూన్ ఐదవ తేదీ తర్వాత కోర్టు రిమాండ్ పొడిగించకపోతే.. అదే రోజు ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు విడుదలయ్యే అవకాశం ఉంది.
