కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో రామ్మోహన్ నాయుడు భేటీ

- 2014-19 మధ్యలో ఉపాధి హామీ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి
- పామ్ ఆయిల్ దిగుమతులపై సుంకం సవరించండి
- రెడ్ గ్రామ్ కంది దినుసుల సేకరణ గడువు పెంచండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సమస్యలు చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. వీరిరువురి మధ్య రైతాంగానికి సంబంధించిన మూడు అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా ఉపాధి హామీ పథకం కింద 2014 – 19 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెల్లించాల్సిన బకాయిల విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే దేశంలోనే అత్యధిక పామాయిల్ ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని క్రూడ్ ఎడిబుల్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతమున్న 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం కారణంగా వచ్చే మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల దేశీయంగా పంట ఉత్పత్తి చేస్ రైతులు నష్టపోతారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు వివరించారు. అందువల్ల పాత సుంకాన్నే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే జాతీయ వ్యవసాయ కార్పోరేషన్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ (నాఫెడ్) ద్వారా సేకరించే పప్పు దినుసులు ముఖ్యంగా రెడ్ గ్రామ్ గడువు ఈనెల జూన్ 15తో ముగియనుందని రైతుల సౌకర్యం దృష్ట్యా సేకరణ గడువు మరింత పెంచాల్సిందిగా కోరారు. తాను చేసిన ప్రతిపాదనలకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారని, త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
