తెలుగు రాజకీయాలను రఫాడిస్తున్న రప్పా… రప్పా

శ్రీకాంత్ విస్సా అనే మాటల రచయిత ఏ ముహుర్తాన పుష్ప-2 సినిమాలో రప్పా రప్పా అనే డైలాగ్ రాశారో కానీ… ఇప్పుడు ఆ డైలాగ్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను రఫాడించేస్తోంది. పుష్ఫ -2 సినిమాలో తన అన్న కుమార్తెను కుర్ర విలన్ గ్యాంగు కిడ్నిప్ చేసిన సందర్భంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన గంట గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుకుతా ఒక్కొక్కడ్ని అనే డైలాగ్ తెలుగు రాజకీయాల్లో కూడా ఫేమస్ అయిపోయింది. ప్రధానంగా ఈ డైలాగ్ ను ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీలు విచ్చలవిడిగా వాడేస్తున్నాయి. ఇంత వరకూ బానే ఉంది. కానీ ఏపీలో ఈ డైలాగ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాడటం అధికార కూటమి పార్టీలకు రుచించడం లేదు. ముఖ్యంగా కూటమిని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ డైలాగ్ వాడుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రప్పా… రప్పా డైలాగ్ వాడటాన్ని భూతద్దంలో చూపించి వైఎస్ఆర్సీపీ ది నరహంతకుల డీఎన్ఏ అని ఎస్టాబ్లిస్ చేసే ప్రయత్నం చేస్తోంది.
కూటమి ప్రభుత్వ ఏపీలో కొలువుదీరిన రోజుల్లోనే సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులు భరించ లే ఆత్మహ్యత చేసుకుంటున్నట్లు చెప్పి గడ్డిమందు తాగి చనిపోయాడు. అయితే నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యులు రెంటపాలలో అతని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించడానికి వైఎస్.జగన్మోహనరెడ్డిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి గత వారం వైఎస్.జగన్ వెళ్లిన సందర్భంలో కొందరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ప్లకార్డుల్లో అడ్డు వచ్చిన వాళ్ళ తలలు గంట గంగమ్మ తల్లి జాతరలో యాట తలలు నరికినట్లు రప్పా రప్పా నరుతాం అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ప్రదర్శించారు. ఈ విషయంపై టీడీపీ పెద్దయెత్తున రాద్దాంతం ప్రారంభించింది. ఆ ప్లకార్డులు ప్రదర్శించిన యువకుడిని అరెస్ట్ చేసింది. అంతటితో ఊరుకోకుండా ఈ తరహా నరుకుడు మనస్తత్వం వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీదని టీడీపీ మంత్రులు, నాయకులు మాట్లాడటం ప్రారంభించారు. ఇక టీడీపీ సోషల మీడియా ఈ అంశాన్ని విపరీతంగా ట్రోల్ చెయ్యడం ప్రారంభించింది.
ఇలా ప్లకార్డులు ప్రదర్శించిన వ్యవహారం ఇటీవల జగన్మోమనరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు విలేకరులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. జగన్మోహనరెడ్డి సైతం నాటకీయంగా ఆ డైలాగ్ ను రిపోర్టర్ తో ఒకటికి నాలగు సార్లు చెప్పించి, రిపోర్టలతో పాటు ఆయన కూడా రప్పా రప్పా అంటూ ప్రామ్ట్ చేసి మరీ సినిమా డైలాగులు వాడటం కూడా తప్పేనా అని తేల్చిపడేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది చేసినా తప్పేనా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో పుష్ప సినిమాలో తగ్గేదేలే అని చెప్పి మెడ కింత చేతులు పెట్టి పైకి తిప్పే సన్నివేశాన్ని కూడా నటించి చూపించి… మెడకింత చేతులు పెట్టి ఇట్టా అన్నాతప్పేనా అని అంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎంత కిక్ కావాలో అంత కిక్ ఇచ్చారు. వైఎస్.జగన్ ఈ రకంగా సమర్ధించడం టీడీపీ నాయకులకు మరింత ఉక్రోషాన్ని కలిగించింది. దీనికి స్పందనగా రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఒకడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి తల నరికితే తప్పేముంది అంటూ వ్యాఖ్యానించి టీడీపీని డిఫెన్స్ లో పడేశాడు. ఈ విధంగా గత వారం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం రప్పా రప్పా చుట్టూతానే తిరిగాయి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యులు తన్నీరు హారీష్ రావు కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్త ఒకరు రప్పా… రప్పా డైలాగు రాసి ఉన్న ప్లకార్డు ప్రదర్శించారు. గత వారం హరీష్ రావు నేతృత్వంలో పటాన్చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు 2028 రప్పా… రప్పా 3.o లోడింగ్ అని రాసి ఉన్న ప్లకార్డు ప్రదర్శించారు. అయితే ఈ పుష్ప సినిమా డైలాగ్ కి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉలిక్కి పడ్డట్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కిపడి అరెస్టులు, కేసుల జోలికి పోలేదు. కానీ ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు ఈ అంశాన్ని యథాలాపంగా ప్రస్తావించారు. మొత్తం మీద పుష్ఫ -2 లోని గంగమ్మతల్లి జాతార… రప్పా… రప్పా నరకతాం అనే డైలాగులు మాత్రం ఇప్పుడు సినిమా ధియేటర్ల నుంచి రాజకీయ వర్గాల ద్వారా జనబాహుళ్యంలోకి చొచ్చుకువెళుతున్నాయి.
