రీకాలింగ్ చంద్రబాబూస్… మ్యానిఫెస్టో
ఐదు రోజుల కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం

రీకాలింగ్ చంద్రబాబూస్… మ్యానిఫెస్టో పేరుతో ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ ఐదు వారాల పాటు ప్రజల విస్తృతంగా ప్రచారం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ ని వైఎస్.జగన్ బుధవారం విడుదల చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో వైఎస్.జగన్ కీలక ప్రసంగం చేశారు. కేవలం సంవత్సరం వ్యవధిలో ఒక ప్రభుత్వంపై ఇంతటి వ్యతిరేకత గతంలో ఎన్నడూ లేదని జగన్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందన్నారు. ఈ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రెడ్ బుక్ పాలన ద్వారా అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఐదేళ్ళ పాలన, ప్రస్తుత పాలనల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. మన హయాంలో ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ పథకాలు అందించామని ఈఏడాది కాలంలో కూటమి పాలన చూస్తే విచ్చలవిడిగా అన్యాయాలు చేస్తున్నారని విమర్శించారు.
గత మన ప్రభుత్వంలో విద్య, వైద్యం, వ్యవసాయా రంగాల్లో విప్లమాత్మక మార్పులు చేసి పాలనలో పూర్తిగా పారదర్శకత చూపించామన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించామని చెప్పారు. చంద్రబాబు ఏడాది పాలనలో మోసం, దగా తప్ప ఏమీ లేదన్నారు. ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి ఎంత నష్టం జరిగింది... మన ప్రభుత్వం ఉండి ఉంటే ఎన్ని ప్రయోజనాలు కలిగేవి అన్న విషయం ప్రజలకు వివరించడమే రీకాలింగ్ చంద్రబాబూస్ మ్యానిఫెస్టో ముఖ్య ఉద్దేశమన్నారు. చంద్రబాబు తాను ఇచ్చిన హామీలకు రిబ్బన్ కూడా కట్ చేయకుండా అన్ని హామీలు అమలు చేసేశామని చెపుతున్నారని, ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటున్నాడని ఎన్నికల్లో ఏం చెప్పాడు… ఏం చేస్తున్నాడన్న విషయం గ్రామ గ్రామాన తీసుకోపోయే కార్యక్రమం ఇదని వైఎస్.జగన్ పార్టీ నాయకులకు వివరించారు.
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి ఏడాది గడిచింది… హనీమూన్ పిరియడ్ ముగిసింది ఇక నుంచి యుద్దం చేయాల్సిందే అని జగన్ చెప్పారు. కాబట్టి అందరినీ కలుపుకుని పోతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని నాయకులకు సూచించారు. ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఇది చాలా కీలకమని, ప్రజా సమస్యలు తెలుసుకుని వారి సమస్యలపై పోరాడాలని చెప్పారు. ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం బాగా నిర్వహించారని జగన్ పార్టీ నేతలను అభినందించారు. అలాగే యువత పోరు కూడా చాలా చోట్ల బాగా జరిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ పరిశీలకు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జ్ లు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
