Revenue Minister Anagani Satyaprasad: ఏపీలో రైతులకు గుడ్న్యూస్: 22ఏ నిషేధ జాబితా నుంచి 5 రకాల భూముల తొలగింపు
22ఏ నిషేధ జాబితా నుంచి 5 రకాల భూముల తొలగింపు

Revenue Minister Anagani Satyaprasad: నూతన సంవత్సరం ప్రారంభంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులు, భూయజమానులకు శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 22ఏ నిషేధ జాబితాలో ఉన్న 5 రకాల భూములను ఈ జాబితా నుంచి పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నూతన సంవత్సరంలో తొలి సంతకంగా ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రైవేటు పట్టా భూములను 22ఏ జాబితా నుంచి సంపూర్ణంగా మినహాయించినట్లు మంత్రి తెలిపారు. ఈ భూములకు సంబంధించి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే అధికారులు స్వయంగా (సుమోటో) చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అలాగే, ప్రస్తుత మరియు మాజీ సైనిక ఉద్యోగులకు చెందిన భూములు సరైన పత్రాలతో ఉంటే వాటిని కూడా నిషేధ జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల భూములను సైతం 22ఏ నుంచి మినహాయించడం జరిగింది.
మిగతా 4 రకాల భూములపై త్వరలోనే జీవోఎంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రైతులు మరియు భూయజమానుల హక్కులను కాపాడటమే ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది రైతులకు భూముల రిజిస్ట్రేషన్, అమ్మకాలు సులభతరం కానుంది.

