ఏపీలో పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా సీప్లేన్ సేవలను ప్రారంభించనుంది. దీని ద్వారా పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మొదటి దశలో అమరావతి, తిరుపతి, గండికోట నుంచి సేవలు మొదలుకానున్నాయి. ఈసీ ప్లేన్ ప్రయాణంతో పర్యాటక రంగానికి ఊతమిచ్చినట్లు అవుతుంది. తక్కువ ఖర్చుతో మారుమూల ప్రాంతాలకు విమాన సౌకర్యం కలగనుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడే ఛాన్స్ ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా విదేశీ పర్యటకులను ఆకట్టుకునే విధంగా ఏపీలో పర్యాటక పాలసీ తెచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. అవి ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే రాష్ట్రంలో త్వరలో సీ ప్లేన్ అందుబాటులోకి తీసుకొచ్చే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం.సాధారణంగా విమానాలుగాలిలో ఎగురుతాయి. అయితే ఈ సీ ప్లేన్ లు జలాశయంలో నీటిపై తేలియాడుతూ... ఆపై నింగిలోకి ఎగిరి విహరించేలా ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన సంస్థ దేశవ్యాప్తంగా 56 మార్గాల్లో సీ ప్లేన్ సేవలు అందించేందుకు టెండర్లు పిలిచింది. ఏపీలో 11 ప్రాంతాలను గుర్తించింది. వాటిలో ఎనిమిది ప్రాంతాల నుంచి సేవలు నడిపేందుకు టెక్నో ఫీజుబిలిటీ నివేదిక, డి పి ఆర్ తయారీకి టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో మొదటి దశలో మూడు చోట్ల సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ తొలి విడతకు సంబంధించి ప్రకాశం బ్యారేజీ, తిరుపతిలోని కళ్యాణి డాం, గండికోట నుంచి సేవలు ప్రారంభించనున్నారు. అమరావతి తో పాటు గండికోట డిపిఆర్ బాధ్యతలను రైట్స్ సంస్థకు అప్పగించారు. తిరుపతి డిపిఆర్ బాధ్యతలను ఫీడ్బ్యాక్ హైవే సంస్థకు అప్పగించారు. ఆసక్తి ఉన్న సంస్థలతో అధికారులు చర్చలు కూడా జరుపుతున్నారు. అయితే మొత్తం 32 మార్గాలలో ఈ సీప్లేన్ రాకపోకలు సాగించేలా ప్రణాళిక రూపొందించారు. మొదటి దశలో చేపట్టే మూడు మార్గాలకు దగ్గర్లో ఎయిర్పోర్ట్లు ఉండడం విశేషం. సిప్లేన్ సేవలు సాధారణ విమాన సర్వీసులతో కలిపి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. విమాన ఖర్చుల కంటే తక్కువగా టిక్కెట్లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఏపీలో సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది నవంబర్ 9న విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు సిప్లేన్ ను ప్రభుత్వం ప్రయోగాత్మకంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. ట్రయల్ రన్ లో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణం చేశారు. అది విజయవంతం కావడంతోనే కొత్తగా మూడు మార్గాల్లో సీ ప్లేన్ సేవలు ప్రారంభించేందుకు నిర్ణయించారు.

Updated On 28 May 2025 10:59 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story