Speaker Ayyanna Patrudu: డీఎస్సీతో సహా ఇతర అంశాలపై వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు రోడ్లపై, బయట మాట్లాడకుండా అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు.

‘ఏవైనా అనుమానాలుంటే అసెంబ్లీకి వచ్చి అడిగితే ప్రభుత్వం సమాధానం చెబుతుంది. రోడ్లపై మాట్లాడి సమాధానం చెప్పాలంటే ఎలా?’ అని స్పీకర్ ప్రశ్నించారు. ప్రభుత్వంతో సమాధానాలు ఇప్పించే బాధ్యత తనదేనని చెప్పారు. ఎమ్మెల్యేగా జగన్, ఆయన పార్టీ సభ్యులు సభకు వచ్చి మాట్లాడాలని సూచించారు.

ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ చేస్తున్న వాదనపై స్పందిస్తూ స్పీకర్ ఇలా అన్నారు: ‘ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటే తగిన సంఖ్యాబలం ఉండాలి. గతంలో తెదేపా తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు.. వారిలో ఐదారుగురిని ఇటు లాగేస్తే మీకు ప్రతిపక్ష నేత హోదా కూడా మిగలదు అని చంద్రబాబుతో నాటి ముఖ్యమంత్రి జగన్ ఇదే అసెంబ్లీలో అనలేదా? ఇప్పుడు జగన్‌కు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా నేను ఎలా ఇవ్వగలను? మీ 11 మంది ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అక్కడే మంత్రులు ఉంటారు. వారితో సమాధానం ఇప్పించే బాధ్యత స్పీకర్‌గా నేను తీసుకుంటా.’

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలు అవుతాయని వైకాపా నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై కూడా స్పీకర్ స్పందించారు. ‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారి కుటుంబ సభ్యుల వసతి కోసం రాజధానిలో క్వార్టర్లను కట్టిస్తే, వాటి గురించి గతంలో మంత్రిగా కూడా పనిచేసిన పేర్ని నాని తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? లేనిపోని అపోహలు సృష్టించి, తప్పుడు మాటలు మాట్లాడితే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు నేను వెనుకాడను’ అని హెచ్చరించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story