President Droupadi Murmu: వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu: ఏఐ, డేటా సైన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలను విద్యార్థులు సమర్థవంతంగా అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు.
ప్రసంగించిన రాష్ట్రపతి, ‘‘విద్యార్థులు ఎన్నో కలలతో విశ్వవిద్యాలయంలోకి అడుగుపెడతారు. భవిష్యత్తు కోసం నూతనోత్సాహంతో తయారవుతారు. విద్యాకాలంలో కష్టపడినట్లే భవిష్యత్తులోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సమాజంలో తమ వంతు పాత్ర పోషించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి’’ అని సూచించారు.
‘వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం’ అని ఆమె నొక్కి చెప్పారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, వేలాది విద్యార్థులున్నా తొలి బ్యాచ్కు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులందరినీ అభినందించారు. భవిష్యత్తు కలల సాకారానికి ఇది ఒక మంచి వేదిక అని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు.
ఈ స్నాతకోత్సవం ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

