కర్నూలు నగరంల ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయడానికి సహకరించమని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్‌ విజ్క్షప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న నారాలోకేష్‌ కేంద్రన్యాయశాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాయలసీమలో హైకోర్టు బెంచ్‌ కావాలనేది అక్కడి ప్రాంత ప్రజల చిరకాల కోరికని కేంద్ర మంత్రి దృష్టికి లోకేష్‌ తీసుకువెళ్ళారు. న్యాయపరమైన అవసరాల కోసం రాయసీమ ప్రజలు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి రావాలంటే 500 కిలోమీటర్లు పైగా ప్రయాణించాల్సి వస్తోందని కేంద్ర మంత్రికి వివరించారు. గతంలో తాను నిర్వహించిన యువగళం పాదయాత్ర సందర్భంగా రాయలసీమ వాసులతో పాటు ఆ ప్రాంత న్యాయవాదులు కూడా కర్నులులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారని కేంద్ర మంత్రికి లోకేష్‌ చెప్పారు. రాయలసీమ వాసుల ఆకాంక్షలకు అనుగుణంగా కర్నూలులో హైకోర్టు బెంచ్‌ త్వరితగతిన ఏర్పాటు చేయడానికి సహకరించాలని కేంద్ర మంత్రి మేఘవాల్‌ ని నారా లోకేష్‌ కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న న్యాయస్ధానాల్లో జ్యుడిషియరీ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధికి సహకారం అందించమని కేంద్ర మంత్రిని కోరారు. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని నారా లోకేష్‌ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ కు అందజేశారు. లోకేష్‌ తో పాటు కేంద్ర మంత్రిని కలసిన వారిలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఎంపీలు తెన్నేటి కృష్ణప్రసాద్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని శివనాథ్‌, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బైరెడ్డి శబరి, సానా సతీష్‌ తదితరులు ఉన్నారు.

Updated On 19 Jun 2025 9:10 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story