Kolleru Lake: కొల్లేరు సరస్సు కాలుష్యంపై సుప్రీంకోర్టు కమిటీ తీవ్ర వ్యతిరేకత
తీవ్ర వ్యతిరేకత

Kolleru Lake: కొల్లేరు సరస్సులో పెరుగుతున్న కాలుష్యం పట్ల సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లేరు లేక్ ప్రొటెక్షన్ కేసులో ఏలూరు జిల్లా కలెక్టర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేయడంలో అటవీ శాఖకు పూర్తి సహకరించాలని కలెక్టర్ను కమిటీ సూచించింది. స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని, కూల్చివేతల పనులకు అడ్డుపడుతున్నారని అటవీ పర్యావరణ శాఖ కమిటీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తక్షణం రంగంలోకి దిగి అక్రమ చెరువుల ధ్వంసం చేపట్టాలని ఏలూరు జిల్లా కలెక్టర్కు కమిటీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
అంతేకాకుండా, కొల్లేరు సరస్సులో పక్షుల మనుగడ ప్రమాదంలో పడుతుండటంపై పిటిషనర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కమిటీ ఆదేశించింది. అక్రమ చేపల చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంపై కూడా కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
కూల్చివేతల పురోగతి, కాలుష్య నివారణ చర్యలు, పర్యావరణ పరిరక్షణపై వివరాలతో నివేదిక సమర్పించాలని కమిటీ సూచించింది. కొల్లేరు సరస్సు రక్షణ కోసం కేంద్రం, రాష్ట్రం కలిసి తక్షణం సమగ్ర చర్యలు చేపట్టాలని ఈ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.

