Surveillance has been intensified in Visakhapatnam city

పహెల్గాం తర్వాత పరిణామాలతో ఉగ్ర దాడులు ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ప్రధాన నగరాలతో పాటు తీరప్రాంతాల్లో భద్రత పెంచారు. అందులో భాగంగా విశాఖ నగరంలో నిఘా ముమ్మరం చేశారు. ప్రస్తుతం విశాఖ నగరాన్నిపోలీసులు జల్లెడ పడుతున్నారు. రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సోదాలు జరుపుతున్నారు. విశాఖలో అణువణువు గాలిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు విశాఖ నగరవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానితులను గుర్తించి వారి కదలికలపై నిఘా పెడుతున్నారు. విశాఖలో ప్రతి కూడలి వద్ద పోలీసుల పహారా పెరిగింది. అనుమానం ఉన్న వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
విశాఖ నగరంపై ఈ స్థాయిలో దృష్టి పెట్టడానికి గత అనుభవాలు ఒక కారణం. 1971లో విశాఖ టార్గెట్ గా పాకిస్తాన్ జలాంతర్గామితో దాడి చేసింది. దీంతో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సున్నితమైన ప్రదేశాలలో నిఘా పెంచారు. విశాఖలోని పోర్టు ఏరియాతో పాటు సముద్ర తీర ప్రాంతంపై పోలీసులు ఫోకస్ పెట్టారు.
నార్త్ కోస్టల్ ఏరియాగా విశాఖకు పేరు ఉంది. సువిశాలమైన పోర్టు ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఉన్నాయి. దేశంలోనే అభివృద్ధి చెందుతున్న నగరంగా గుర్తింపు ఉంది. అందుకే పాకిస్తాన్ టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే కేంద్రం హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
