కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని అదేశించిన సీయం చంద్రబాబు

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళ విషయంలో జరిగిన అమానవీయ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై దాడి చేసినవారెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కుప్పం మండలంలో మహిళపై జరిగిన దాడి వ్యవహారంపై జిల్లా ఎస్పీతో ముఖ్యమంత్రి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ముఖ్యమంత్రికి సంఘటన పూర్వాపరాలు వివరించిన చిత్తూరు జిల్లా ఎస్పీ నిందితుడ్ని ఇప్పటికే అరెస్ట్‌ చేశామని తెలిపారు. నిందితుడిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీయం ఎస్పీని ఆదేశించారు. ఇటువంటి చర్యలు పునారావృతం కాకుండా చూడాలని ఎస్పీకి సీయం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు చంద్రబాబు చెప్పారు.

కుప్పం నియోజకవర్గం నారయణపురం గ్రామంలో మునికన్నప్ప అనే టీడీపీ కార్యకర్త అప్పుడ కట్టడం లేదని శిరీష అనే మహిళను నడిరోడ్డు మీద పట్టుకుని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్ళి చెట్టుకు తాళ్ళతో కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. శిరీష భర్త తిమ్మరాయప్ప మునికన్నప్ప వద్ద రెండేళ్ళ క్రితం 80వేల రూపాయలు అప్పుతీసుకున్నాడు. అతని అప్పుల భారం ఎక్కువ కావడంతో ఊరు విడచిపెట్టి పారిపోయాడు. తిమ్మరాయప్ప పారిపోవడంతో అతని భార్య ఇద్దరు బిడ్డలతో కూలీనాలీ చేసుకుని అదే ఊరిలో నివశిస్తోంది. తను కూలీనాలీ చేసి సంపాదిస్తున్న పైసల్లోనే కొంత మునికన్నప్ప అప్పు తీరుస్తూ జీవితం నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో శిరీషపై మునికన్నప్ప వేధింపులు ఎక్కువైపోయాయి. సోమవారం అది పరాకాష్టకు చేరుకుని శిరీషను చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టేంత వరకూ వచ్చింది. అయితే ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటంతో పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని శిరీషను విడిపించి టీడీపీ కార్యకర్త మునికన్నప్పను అరెస్ట్ చేసి అతనిపై బీఎన్‌ఎస్‌ 341,323,324,506/34 సెక్షన్ల కింద కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated On 17 Jun 2025 11:43 AM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story