తెలుగుదేశం పార్టీ మహానాడు తొలి రోజు వేడుకలు కడపలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభోపన్యాసంతో వేదిక మార్మోగింది. తెలుగు తమ్ముళ్ల ఉత్సాహాన్ని చూసి చంద్రబాబు పులకించిపోయారు. మహానాడు అంటే పసుపు పండుగ. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, జోరు తగ్గదు.. హోరు తగ్గదు అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని జోష్‌తో ప్రారంభించారు.



“ఇప్పటి వరకు రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిలో మాత్రమే జరిగేది. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి మహానాడును కడపలో నిర్వహించడం గర్వకారణం. ఇది రాయలసీమ ప్రజల తీర్పుకు మనం ఇలా కృతజ్ఞతలు చెబుతున్నాం" అన్నారు.



93% స్ట్రయిక్ రేట్, 57% ఓటు షేర్ సాధించిన 2024 ఎన్నికలు కొత్త చరిత్రను లిఖించాయని గుర్తు చేస్తూ, ఈ విజయానికి మూల కారణం కార్యకర్తల త్యాగాలు, అధికారం మీ పోరాటాల ప్రతిఫలం అని, కార్యకర్తలు లేకుంటే తాను కూడా లేను అని చంద్రబాబు భావోద్వేగంతో చెప్పారు.



తెలుగుదేశం పార్టీ చరిత్రే ప్రజల జీవన ప్రమాణాల మార్పుకు దర్పణం అని చెప్పారు. బాలికా విద్య నుంచి బడుగు వర్గాల అధికారంలో భాగస్వామ్యం వరకు.. 2 రూపాయల బియ్యం నుంచి 4000 రూపాయల పింఛన్ వరకు.. ప్రతి దశలో టీడీపీ పాలన ట్రెండ్ సెట్టర్, సంస్కరణలకు బ్రాండ్ అంబాసిడర్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.



సామాజిక న్యాయానికి దేశ రాజకీయాల్లో శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అని, ఇది పార్టీ కార్యకర్తలందరికీ గర్వకారణమన్నారు. 40 ఏళ్ల క్రితమే బీసీలను అధికారం లోకి తీసుకువచ్చిన ఘనత టీడీపీదే అని, ఇప్పుడు దేశమంతా బీసీలపై మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇది తెలుగుదేశం పార్టీ ప్రభావం అని చెప్పారు. ప్రాంతీయ పార్టీగా పుట్టిన పార్టీ.. కోటి మందిని సభ్యులుగా నమోదు చేసుకోవడం విశేషమని, ఈ సామర్థ్యం వల్లే టీడీపీ కేంద్రంలో కూడా అనేక కీలక నిర్ణయాల్లో భాగస్వామ్యమైందని తెలిపారు.



కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతోందని, ఈ యేడాదిలోనే నెలకు 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని గడిచిన యేడాదిలో రూ.33,000 కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు చేశామన్నారు. కోటికి పైగా దీపం పథకం లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారని, ఆకలితో ఉన్నవాళ్లకోసం అన్న క్యాంటీన్లు అన్నం పెడుతున్నాయని అన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు చేశామని, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామని, ఉచిత ఇసుక పంపిణీ చేస్తున్నామని, మత్స్యకారులకు, మతపరమైన నేతలకు గౌరవ వేతనాలు అందిస్తున్నామని.. అన్నింటికీ మించి.. పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం పునరుద్ధరించామని చంద్రబాబు మహానాడు వేదిక మీదుగా వివరించారు.



రాయలసీమ అభివృద్ధి పేటెంట్ టీడీపీదే అని స్పష్టం చేశారు. తెలుగుగంగ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే చేశామని, డ్రిప్ ఇరిగేషన్‌కు ఇజ్రాయిల్ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటున్నామని, కడప-కర్నూలు ఎయిర్‌పోర్టులు, అనంతలో కియా కంపెనీ, కడప కొప్పర్తి, కర్నూలు ఓర్వకల్ పారిశ్రామిక హబ్‌లు టీడీపీ రూపొందించినవే అన్నారు.



తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త మీసం మెలేసేలా గౌరవం, గుర్తింపు, సంక్షేమం అందిస్తామని, సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని, ప్రజల ఆశలకు, విశ్వాసానికి నిజమైన న్యాయం చేస్తామని, మనం అంతా కలిసి గెలవాలని, తెలుగుజాతి నంబర్ వన్ కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.




Politent News Web4

Politent News Web4

Next Story