మహనాడులో పసందైన వంటకాలు ఇవే....

కడప మహానాడు కోసం తెలుగుదేశం శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు కోసం ఏర్పాట్లన్నీ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మంగళవారం ప్రారంభం కానున్న మహానాడులో పాల్గొనేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరలి రావడం అప్పుడే మొదలయ్యింది. దీంతో, మహానాడు సభ జరగనున్నా ప్రాంగణం దగ్గర, జిల్లాలోని పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదుగురు ఎస్పీ స్థాయి అధికారులు ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ నెల 27వ తేదీ మంగళవారం ప్రారంభమై ఈనెల 29వ తేదీ గురువారం ముగుస్తుంది. మూడు రోజుల పాటు కడప నుంచే పరిపాలన సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మంత్రివర్గం మొత్తం దాదాపు అక్కడే ఉండనున్నారు. దీంతో, రాష్ట్ర పాలన అక్కడి నుంచే అందించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను కూడా ఇప్పటికే పార్టీ నేతలు, అధికార యంత్రాంగం కూడా పూర్తి చేసింది.
ఇక, మహానాడు అంటే అందరికీ గుర్తుకు వచ్చేది పసందైన భోజనాలు. తెలుగుదేశం పార్టీ మహానాడులో వడ్డించే వంటకాల గురించి మొదటినుంచీ ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అత్యంత పకడ్బందీగా భోజన ఏర్పాట్లు చేయడంలో మంచి అనుభవం ఉన్న పార్టీ కూడా తెలుగుదేశమే.. అన్న వాదన ఉంది. రాష్ట్రంలోని అన్ని రకాల రుచులను ఎక్కడ పెట్టినా వండి వడ్డించడం మహానాడులో ప్రతి ఏడాది జరిగేదే. అదే సమయంలో ఎక్కడ మహానాడు జరిగితే ఆ ప్రాంతంలో ఫేమస్ అయిన వంటకాలు మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అందించడం కూడా టీడీపీ స్పెషాలిటీగా చెప్పుకుంటారు. కార్యకర్తలు, నేతలు, మంత్రులు, అధికారులు, పోలీసులు ఇలా విడివిడిగా ఎవరికి సంబంధించిన కౌంటర్లలో వాళ్లకు వంటకాలు సమకూరుస్తారు. వాటితో పాటు.. వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తారు.
కడప జిల్లాలో జరిగే మహానాడులోనూ అదరిపోయే వంటకాలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు ఇరవై రెండు రకాల వంటకాలు సిద్ధమవుతున్నాయి. కడపలో ప్రసిద్ధి చెందిన వంటకాలతో పాటు ఇరవై రెండు రకాల మెనూను సిద్ధం చేసినట్లు తెలిసింది. రోజులకు వేలాది మందికి టిఫిన్లతో పాటు స్నాక్స్, రెండు పూట భోజన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మూడు రకాల చెట్నీలు కారంపొడి మామూలే. కాఫీ, టీలు కూడా సర్వ సాధారణమే. వచ్చిన కార్యకర్తల నుంచి నేతలు, మంత్రులు వరకూ ఇక్కడే భోజనాలు చేయనుండటంతో వారికోసం ప్రత్యేకంగా తయారు చేయడానికి ఇప్పటికే వంట తయారు చేసేవాళ్లు కడపకు చేరుకున్నారు. వారికి ప్రత్యేకంగా రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో అక్కడే వంటకాలు చేయనున్నారు. కూరగాయలు తరగడం దగ్గర నుంచి వంటలు సిద్ధమయ్యే వరకూ ఆ రెండు ఎకరాల్లోనే చేయాలని, వెజ్, నాన్ వెజ్లకు సంబంధించి ప్రత్యేకంగా నిపుణులైన వారిని రప్పించారు.
కడపలో మహానాడులో బ్రేక్ ఫాస్ట్ కింద కడప ఎర్ర కారం దోసెలతో పాటు ఇడ్లీ, వడ, పొంగల్, పూరిలను సిద్ధం చేయనున్నారు. అలాగే భోజనాల్లోకి వెజిటేరియన్లో గుత్తివంకాయ కూరతో పాటు దొండకాయ ఫ్రై, పప్పు, సాంబారు, రసం, గడ్డ పెరుగుతో వడ్డించనున్నారు. ఇక నాన్ వెజ్లో మటన్ కర్రీ, రొయ్యల వేపుడు, చికెన్ వేపుడు, చేపల పులుసు వంటివి సిద్ధం చేస్తున్నారు. అయితే అన్నిజిల్లాలకుచెందిన వారు వస్తుండటంతో రాయలసీమ రుచులతో పాటు కోనసీమా, కోస్తాంధ్రకు సంబంధించిన ప్రత్యేక వంటకాలు కూడా సిద్ధం చేశారు. దీంతో పాటు తూర్పు గోదావరి జిల్లా నుంచి కాకినాడ కాజా, పూతరేకులు, కాళహస్తి పాలకోవా, బాదూషా, మాడగుల హల్వా వంటివి కూడా తెప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ప్రాంతాల పిండి వంటకాలతో పాటు అన్ని ప్రాంతాలకు చెందిన రుచులను మహానాడులో అందించనున్నారు.
