ఏడాది పాలనపై నేడు కూటమి ప్రభుత్వం సమావేశం

- హాజరుకానున్న సెక్రటరీలు, కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు
- కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా
- ఏడాదిగా జరిగిన సంక్షేమంపై సమీక్ష
- రెండో ఏడాది లక్ష్యాలు… భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఆదికారులు, ప్రజాప్రతినిధులతో ఒక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. నేటి సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమం జరగనుంది. ఏపీ సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సుపరిపాలనలో తొలి అడుగు సమావేశాన్ని నిర్వహించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన జూన్ 12వ తేదీనే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించినా అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. నేటి సమావేశంలో గడచిన ఏడాదిగా చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషి తదితర అంశాలు సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అమరావతిలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్ఓడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపిలు హాజరు అవుతారు.
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపైనా దృష్టి
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక, పాలనా విధ్వంసాలను సరిచేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపిస్తోంది. స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వర్ణాంధ్ర @2047 విజన్ లాంటి దీర్ఘకాలిక ప్రణాళికల్ని కూడా కూటమి ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు-పెట్టుబడులను తీసుకురావటం, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన తదితర అంశాల్లో వేగంగా అడుగులు వేస్తోంది. ఏడాదిలో చేసిన సుపరిపాలనను సమీక్షించుకునేందుకు-రాష్ట్ర భవిష్యత్ కోసం చేసిన ప్రణాళికల్ని వివరించేలా 'సుపరిపాలనలో తొలిఅడుగు' అనే పేరిట ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఇదే సమయంలో ఈ ఏడాది ఏం చెయ్యాలి...ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనే అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ వివరిస్తూ....ఈ ఏడాది చేపట్టే కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. 26 జిల్లాల నుంచి వచ్చే అధికారులతో సమావేశం ముగిసిన తరువాత..అందరితో కలిసి సిఎం, మంత్రులు అక్కడే డిన్నర్ చేయనున్నారు.
