ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకేరోజు రెండు షాక్ లు తగిలాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీలను కోల్పోయిన వైఎస్సార్సీపీకి తాజాగా మరో రెండు మున్సిపాలిటీలు ఆ పార్టీ నుంచి చేజారిపోయాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ గొలగాన రమాదేవి పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మరోవైపు ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణరావుపై కూడా అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆ రెండు మున్సిపాలిటీలు కూటమి కైవసం చేసుకుంది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో సీన్ మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కూటమి వైపు మొగ్గు చూపడంతో.. ఈ రెండు మున్సిపాలిటీల్లో టిడిపి పాగా వేసింది.బొబ్బిలిలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైస్ చైర్ పర్సన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా 22 మంది కౌన్సిలర్లు నిలిచారు. మార్కాపురంలో 35 మంది కౌన్సిలర్లకు గాను 19 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఈ రెండు చోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూసింది. బొబ్బిలి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రమాదేవి పై అవిశ్వాసం ఏకపక్షంగా నెగ్గింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిమంది, టిడిపికి చెందిన పదిమంది కౌన్సిలర్లు, ఒక స్వతంత్ర కౌన్సిలర్, ఆపై ఎమ్మెల్యే బేబీ నాయనా రమాదేవికి వ్యతిరేకంగా ఓటు వేశారు. 22 మంది మద్దతుతో అవిశ్వాసం నెగ్గినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అయితే రమాదేవి పై పెట్టిన అవిశ్వాసానికి అదే పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ 2 చెలికాని మురళీకృష్ణ రావు మద్దతు పలికి షాక్ ఇచ్చారు.

ఇటీవల బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సాగు వెంకట మురళీకృష్ణరావుపై కూడా అవిశ్వాసం పెట్టడంతో ఆయన పదవి కోల్పోయారు. టిడిపికి చెందిన శరత్ బాబు చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఇప్పుడు వైస్ చైర్మన్ పదవి పోవడంతో నోటిఫికేషన్ జారీ కానుంది.ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణరావుపై కూడా అవిశ్వాసం నెగ్గింది. త్వరలో ఈ పదవి టిడిపికి దక్కనుంది. మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉంటే వైసిపి 30, టిడిపి ఐదు స్థానాలను గెలుచుకుంది. అయితే మున్సిపల్ చైర్మన్ పని తీరు నచ్చక 12 మంది వైసీపీ కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. అనంతరం 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి ప్రతిపాదన పెట్టారు. అవిశ్వాస తీర్మాన సమావేశాన్ని నిర్వహించారు. 23 మంది కౌన్సిల్ సభ్యులతో పాటు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 19 మంది ఓటు వేశారు. దీంతో చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. ఈ పదవి సైతం టిడిపి ఖాతాలో చేరనుంది.

Politent News Web 1

Politent News Web 1

Next Story