వల్లభనేని వంశీకి మళ్ళీ అస్వస్ధత... జీజీహెచ్ కి తరలింపు

గన్నవారం మాజీ శాసనసభ్యుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. గడచిన మూడున్నర నెలలుగా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ తరచు అరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు, జైలులో ఉన్నప్పుడు అనారోగ్యం పాలైతే పలుమార్లు పోలీసులు వల్లభనేని వంశీని దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తీసుకువెళ్లి వైద్యం చేయించేవారు. అయితే తాజాగా సోమవారం ఉదయం జైలులో ఆయన శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో పోలీసులు వంశీని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వంశీని గుంటూరు పరభుత్వాసుపత్రిలో చేర్చారన్న విషయం తెలుసుకుని ఆయన సతీమణి, పంకజశ్రీ ఆసుపత్రికి వచ్చారు. అలాగే గుంటూరు నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమాతో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు జీజీహెచ్ కి చేరుకున్నారు. అయితే పోలీసులు జీజీహెచ్ గేట్లు మూసివేసి ఆసుపత్రి మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుని ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఈ క్రమంలో వంశీ సతీమణి పంకజశ్రీకి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నూరి ఫాతిమాను కూడా ఆసుపత్రి లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రికి వచ్చే రోగులు కూడా లోపలికి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
