సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాం - చంద్రబాబు
We have fulfilled the Super Six promises - Chandrababu

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ నెరవేర్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈనెల 20వ తేదీన అన్నదాత సుఖీభవ కేంద్రం ఇస్తుందని, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తాము కూడా ఇస్తామన్నారు. అలాగే, ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ఆడబిడ్డ నిధిని పీ-4కి లింక్ చేశామని, ఉద్యోగాలు పెద్ద ఎత్తున కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు నిరుద్యోగభృతి లింక్ చేస్తామని చెప్పారు. ఇక, సూపర్ సిక్ష్ హామీలు అయిపోయాయని, సూపర్ సిక్స్ మీద ఎవరైనా మాట్లాడితే నాలుక మందం తప్ప ఇంకోటి లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు చంద్రబాబు.
2024-25 మధ్య కాలంలో రూ.34 వేల కోట్ల పింఛన్ చెల్లించామన్నారు. హామీ ఇచ్చినట్లుగానే పింఛన్ ఒకేసారి పెంచామని, ఏడాదికి రూ.34 వేల కోట్ల భరోసా పింఛన్ ఇస్తున్నది ఏపీలోనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. వలంటీర్లు ఉంటేనే సాధ్యమన్నారని, కానీ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడికే పింఛన్ అందిస్తున్నామన్నారు. పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరినీ గౌరవిస్తామని, తీసుకున్న డబ్బును దుబారా ఖర్చు చేయకూడదన్నారు. సంక్షేమం పైనే ఎప్పుడూ ఆధారపడకూడదని, సంక్షేమాన్ని ఆర్థిక చేయూతగా మార్చుకోవాలని చంద్రబాబు సూచించారు. బాబాయిని చంపారు.. నాటి సీఎం చేతుల్లోనే కత్తులు పెట్టారని,
నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి పత్రిక బరితెగించిందని చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రౌడీ షీటర్, గంజాయి బ్యాచ్ కోసం తెనాలి వెళ్లి పరామర్శించారని, రైతుల పరామర్శకు 15 వేల మందిని వెంట బెట్టుకుని ఎందుకు వెళ్లాలని చంద్రబాబు ప్రశ్నించారు. మీ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు కదా.. అమరావతిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని నిలదీశారు. టాపిక్ డైవర్షన్ కోసమే పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ డ్రామా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. డబ్బులు ఇచ్చేది తామేనని, అమలు చేసేది కూడా తామే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. దేశ చరిత్రలో రూ.34 వేల కోట్లు ఇచ్చే కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా అని, పెంచిన పెన్షన్ ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి బకాయిలతో సహా చెల్లించామన్నారు. మూడు నుంచి నాలుగు వేలు ఒకేసారి పెంచానన్నారు. బెడ్కే పరిమితమైన రోగులకు రూ.1.80 లక్షలు ఇస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రమైన దరిదాపుల్లో ఉందా? అది తన కమిట్మెంట్ అని చెప్పారు. ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టకుండా.. ఆర్థిక పరిస్థితులు మెరుగు పరుచుకుని పేదరికం నుంచి బయటకు రావాలని సూచించారు. సంక్షేమం నిలదొక్కుకోవటానికి రావాలి. సంక్షేమంపై ఎప్పుడూ ఆధారపడే పరిస్థితి రాకూడదు. దీనిపై ఎలా చేయాలో గైడ్ చేస్తామన్నారు. సూపర్ సిక్స్ హామీలపై కొంతమంది విషప్రచారం చేసి దౌర్జన్యం చేయాలని అనుకుంటున్నారని, వాళ్ల ఆటలు సాగనీయబోమని, తన మంచితనాన్ని చూశారని, తోకతిప్పితే.. ఎవ్వరినీ ఉపేక్షించను. అందరికీ గుణపాఠం ఉంటుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు చంద్రబాబు.
