హమీలు పొలిటికల్ గవర్నన్స్ ద్వారా అమలు చేస్తాం - చంద్రబాబు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పొలిటికల్ గవర్నెన్స్ ద్వారా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరి ఏడాది పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అధ్యక్షతన ఏపీ సచివాలయం ఆవరణలో సదస్సు జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీఎస్, సెక్రటరీలు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు హాజరైన ఈ సదస్సులో ఏడాది సంక్షేమం పై సమీక్ష చేశారు. అలాగే అభివృద్ధిపై అవలోకనం, భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు ఈరోజు ఇక్కడ ఉండటానికి ప్రధాన కారణం ప్రజలే అన్నారు. ప్రజలు కూటమిని ఆమోదించి 94 శాతం మంది కూటమి అభ్యర్ధులను గెలిపించారన్నారు. ప్రజల ఆశలును నెరవేర్చే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం నాయకులపైనే ఉందన్నారు. అన్నీ చేశామని చెప్పటం లేదు కానీ ఊహించినదాని కంటే ఎక్కువ చేశామని మాత్రం చెప్పగలనన్నారు. మూడు పార్టీలు ఓకే మాటపై ముందుకు వెళుతున్నామని అందుక పవన్ కళ్యాణ్, పురంధేశ్వరిలకు సీయం ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ విధ్వంసం నుంచి లా అండ్ ఆర్డర్ భ్రష్టు పట్టిపోయిందన్నారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడి ఏపీకి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. పోలవరం పూర్తి చేసుకుంటే రాష్ట్రానికి నీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. సంపద సృష్టించి ఆదాయం పెంచితే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతామన్నారు. ఏపీలో సర్వీస్ సెక్టార్ తక్కువని అందువల్ల రాష్ట్రానికి ఆదాయం తక్కువ వస్తోందన్నారు. వ్యవసాయం ద్వారా ఆదాయం పెరగదు కానీ జీఎస్డీపీపై కనిపిస్తుందన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రూ.11,400 కోట్లు కేంద్రం ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు. పోలవరానికి కూడా 12500 కోట్లు ఇచ్చిందని, ఆ ప్రాజెక్టును 2027కి పూర్తి చేస్తామని సీయం హామీ ఇచ్చారు. ఎంత మంద పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పాము… ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. అన్నదాత సుఖీభవ కూడా కేంద్రం నిధులు ఇవ్వగానే ఇస్తామని స్పష్టం చేశారు. కరెంట్ ఛార్జీలు భారం తగ్గాలంటే సూర్య ఘర్ తీసుకోమని సీయం సలహా ఇచ్చారు. గత ప్రభుత్వం గంజాయిని పెంచి పోషించిందని, మేము వచ్చాక గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించగలిగామని సీయం చంద్రబాబు తెలిపారు. పోలీసు యంత్రాంగం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఆడబిడ్డలకు రక్షణ ఉండి తీరాలన్నారు. ఒక్క పిలుపుతో 33వేల ఎకరాలు ఇచ్చారు... సద్వినియోగం చేసుకుంటూ నాలుగేళ్లలో అమరావతి పూర్తి చేస్తామని ప్రకటించారు. పోలవరం-బనకచర్ల రాష్ట్రానికి, రాయలసీమకు గేమ్ ఛేంజర్ అని తెలంగాణ కూడా ఆ నీటిని వాడుకోవచ్చన్నారు. ఆర్థిక అసమానతలు పోగొట్టడానికే పీ4 తెచ్చామన్నారు. 15 లక్షల బంగారు కుటుంబాలు దత్తత తీసుకోవాని లక్ష్యం పెట్టకున్నామని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా రెండు కుటుంబాలను దత్తత తీసుకోవాలని సీయం చంద్రబాబు ఈ సభలో పిలుపునిచ్చారు.
