• కూటమి ప్రభుత్వ విజయాలను జులై 2నుంచి ఇంటింటికీ తీసుకెళ్లండి
  • కూటమిలో మనది పెద్దన్న పాత్ర... సమన్వయంతో ముందుకు సాగాలి
  • ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషిచేయండి
  • మచిలీపట్నం ఉత్తమ కార్యకర్తల సమావేశంలో యువనేత నారా లోకేష్

ఇకపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, నేను ప్రతిరోజు 5గురు ప్రజలు, 5 మంది కార్యకర్తలతో మాట్లాడి ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ అంతర్గత సమస్యలపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్‌ ప్రకటించారు. మచిలీపట్నంలో గురువారం నిర్వహించిన ఉత్తమక కార్యకర్తల సమావేశంలో లోకష్‌ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ఏ ఒక్క కార్యకర్తను విస్మరించేది లేదని, వారి సేవలను తప్పినిసరిగా గుర్తిస్తామని లోకేష్‌ స్పష్టం చేశారు. కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని అవన్నీ కూడా పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకలాపాలను డిజిటల్ విధానంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించడం ద్వారా పనిచేసిన వారిని గుర్తించాలన్నదే మన పార్టీ విధానమని లోకేష్‌ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక కేడర్ ను మరువకుండా చంద్రబాబు, నేను ప్రతిజిల్లాకు వెళ్లినపుడల్లా కార్యకర్తలను కలుస్తున్నామని తెలిపారు. 10 నిర్ణయాల్లో ఒక తప్పు జరగొచ్చు, తప్పులున్నపుడు వివిధ స్థాయిల్లో నాయకుల ద్వారా తమ దృష్టికి తెస్తే సరిదిద్దుకుంటాం అని లోకేష్ అన్నారు.

జులై 2నుంచి గడపగడపకు వెళ్లండి

జులై 2వతేదీ నుంచి ప్రతిఒక్కరూ గడపగడపకు వెళ్లి గత ఏడాది కాలంలో మనం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లమని నారా లోకేష్‌ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బాబు సూపర్ – 6 కార్యక్రమాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని. తల్లికి వందనం పథకం కింద ఒక్క జిఓ తో రూ.8,745 వేల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా నిర్ణీత సమయానికే తల్లికి వందనం పథకాన్ని విజయవంతంగా అమలుచేశామన్నారు. మెగా డిఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని చెప్పారు. పెద్దఎత్తున పరిశ్రమలను రప్పించడం ద్వారా అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనకు శాయశక్తులా కృషిచేస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధులకు 4వేల పెన్షన్ అందజేస్తున్నామని. ఆగస్టు 15నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నామని లోకేస్‌ పేర్కొన్నారు.

అహంకారం, ఇగోలను వీడండి!

అహంకారం, ఇగోలను ప్రజలు హర్షించరని గత పాలకులు అహంకారంతో వ్యవహరించడం వల్లే 151 కాస్త 11కి పడిపోయిందని నారా లోకేష్‌ అన్నారు. ఎవరైనా నాయకులు తప్పుగా ప్రవర్తిస్తే ఆ ప్రభావం పార్టీపై పడుతుంది ప్రజల్లోకి వెళ్లి ఓర్పు, సహనంతో వారు చెప్పే సమస్యలను వింటూ పరిష్కారానికి కృషిచేయండని హితవు పలికారు. గత ప్రభుత్వం కక్షసాధింపుతో నిలిపివేసిన ఉపాధి హామీ, నీరు – చెట్టు బిల్లులను 90శాతం వరకు క్లియర్ చేశామని మిగిలినవి కూడా జులైలోగా అందజేసే ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలుంటే మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వచ్చి పరిష్కరించుకోవాలని లోకేష్‌ సూచించారు. యువగళం పాదయాత్ర, శంఖారావం కార్యక్రమంలో మీ ప్రాంతానికి రాలేకపోయాను, ఆ తర్వాత నా అవసరం లేకుండా మీరు భారీ మెజారిటీతో పార్టీని గెలిపించారు. పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ బలం, బలహీనతలను నేను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నా. చట్టపరిధిలో రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది, ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదని నారా లోకేష్‌ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఆర్టీసి చైర్మన్ కొనకళ్ల నారాయణ పాల్గొన్నారు.

Updated On 25 Jun 2025 1:35 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story