ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి యేడాది పూర్తి కావస్తోంది. ఈ యేడాది పరిపాలనలో ప్రభుత్వం పనితీరుపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు ఉన్నతాధికారులపై విమర్శలు, ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే వివిధ డిపార్ట్‌మెంట్లలోని ఐఏఎస్‌లతో పాటు.. సీఎంఓలోనూ భారీగా బదిలీలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వంలో ఆలిండియా సర్వీస్ అధికారుల పనితీరుపై శాఖల వారీగా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. మరోవైపు.. సీఎం ఆలోచనకు తగ్గట్లు, ఆయన ఆశించిన స్థాయిలో సీఎంఓలో కొందరి పనితీరు లేదన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే శాఖల వారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలతో పాటు సీఎంఓనూ ప్రక్షాళన చేయనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఒకరిద్దరు అధికారులకు తప్ప మిగిలిన వారికి ట్రాన్స్‌ఫర్‌ తప్పదని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి పేషీలో ఇద్దరు అధికారుల హవా నడుస్తోందట. వారిలో ఒకరు వైసీపీ ప్రభుత్వ హయంలో ఢిల్లీలో పనిచేశారు. మరొకరు వైసీపీ బాధిత అధికారిగా ప్రచారం ఉంది. ఈ క్రమంలోనే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రితో కలిసి చదువుకున్న ఓ ఐఏఎస్‌ అధికారితో పాటు, మరో కీలకమైన అధికారి తమ సీట్లను భద్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎంఓలో ప్రస్తుతం ఉన్న అధికారుల్లో ఒకరు గతంలో ఢిల్లీలో పనిచేశారు. ఢిల్లీ అధికార వర్గాల్లో ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. ఆ కోటాలోనే ఆయనకు సీఎంఓలో ప్రాధాన్యత దక్కిందంటున్నారు. అయితే, యేడాది కాలంలో రాష్ట్రానికి ఆయన ద్వారా కలిగిన ప్రయోజనం ఏంటన్న చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో సాగుతోంది.

మరో ముఖ్యమైన అధికారికి హిందీపై పెద్దగా పట్టు లేకపోవడం మైనస్‌గా మారిందంటున్నారు. దీంతో, యువ అధికారితో ఆయనకు దోస్తీ కుదిరిందట. ప్రస్తుతం ఒకరికొకరు అండగా ఉన్న ఇద్దరు అధికారులకు మొదట్లో పొసిగేది కాదని.. ఆ తర్వాత పరిస్థితుల ప్రభావంతో ఇద్దరు కలిసి పోయినట్టు చెప్పుకుంటున్నారు. సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ అధికారి వ్యవహార శైలిపై అధికార పార్టీ నేతల్లో మొదటి నుంచి తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ నాయకుడికి ఆయన తీరుపై పలుమార్లు ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నకీలకమైన మంత్రి తరపున వచ్చే ఆదేశాలను, సూచనలు ఆ అధికారి మొదట్లో ఖాతరు చేసేవారు కాదట. ఈ పరిణామంపై ఆ నాయకుడు అసంతృప్తిగా ఉన్నట్టు తెలియడంతో కొద్ది నెలలుగా ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో కొందరు అధికారులు తమను పట్టించుకోవడం లేదని అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే, మంత్రితో సన్నిహితంగా ఉండే అధికారి మధ్యవర్తిత్వంతో యువ నాయకుడికి ఆ అధికారి వివరణ ఇచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించే విషయంలో అంతిమ నిర్ణయం ముఖ్యమంత్రిదే కావడంతో ఇప్పుడు బదిలీలపై ఉత్కంఠ నెలకొంది.

ప్రభుత్వం మారిన వెంటనే వైసీపీ ప్రభుత్వ హయంలో తనను వేధింపులకు గురి చేశారని, పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా వేధించారని ఓ అధికారి ప్రభుత్వ పెద్దలకు చెప్పుకున్నారు. దీంతో, ఆయనకు ముఖ్యమైన స్థానంలో కీలకమైన పోస్టింగ్ లభించింది. ఇప్పుడు బదిలీ ప్రచారం జరుగుతుండటంతో మళ్లీ ఆ నినాదాన్ని తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో బాధిత అధికారిగా ఆయనకు సానుభూతి లభించింది. ప్రస్తుతం అధికారుల బదిలీ, స్థాన చలనాలు తప్పవని తెలియడంతో మళ్లీ వైసీపీ బాధితులమనే అస్త్రాన్ని తెరపైకి తెచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయంలో పోస్టింగ్‌ దక్కక పోవడానికి, అనుమతి లేకుండా అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్ళడంతో జగన్‌ ప్రభుత్వంలో సీఎంఓ ఆయన స్థానంలో మరొకరిని నియమించారని, దానికే ఆయన పొలిటికల్ కలరింగ్ ఇచ్చుకుంటున్నారని చెబుతున్నారు. ఐఏఎస్‌లకు వృత్తిపరమైన శిక్షణలో భాగంగా సెలవులు మంజూరు చేస్తే దానిని పొడిగించడంతో మరొకరికి ఆ బాధ్యతలు ఇచ్చారని సచివాలయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురాగలిగిన అధికారుల అవసరం తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహన ఉన్న వారికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఢిల్లీ స్థాయిలో పనులు చక్కబెట్టే అధికారులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక శాఖకు సారథ్యం వహిస్తున్న పీయూష్‌ కుమార్‌కు మరో ఏడాదిన్నరలో ఆయనకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఆయన ఎక్కువ కాలం రాష్ట్ర సర్వీసుల్లో కొనసాగే అవకాశాలు కనిపించడంలేదు. ఈ పరిస్థితుల్లో ఏపీలో నేర్పు ఉన్న అధికారుల కొరత తీవ్రంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఢిల్లీలో పనులు జరగాలంటే ఉత్తరాది అధికారులకు పనులు జరిగినంత సులువుగా తెలుగు అధికారుల హవా నడవదని ప్రధానంగా భాష సమస్యను అధిగమించి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శుల్ని మెప్పించగలిగిన అధికారుల లోటు ఉందని ఐఏఎస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో పనులు చక్కబెట్టగలిగి, రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని తెప్పించడంలో ఏపీ క్యాడర్‌ అధికారులు వెనుకబడుతున్నారనే ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన అధికారికి, మరో అధికారి సంప్రదింపుల విషయంలో, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడంలో సాయం చేస్తున్నా అవి పెద్దగా వర్కౌట్ కావడం లేదని తెలుస్తోంది. కీలకమైన పోస్టింగ్‌లో ఉన్న మరో యువ అధికారి పనితీరుపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడాది కాలంలో ముఖ్యమైన బాధ్యతల్లో ఉన్నా ఆయన ప్రభావాన్ని చూపలేకపోయారని చెబుతున్నారు. పోస్టింగ్‌ విషయంలో ప్రభుత్వ అధినేతను ప్రసన్నం చేసుకున్న వారికే ప్రాధాన్యత లభిస్తుండటంతో త్వరలో జరిగే ప్రక్షాళనలో తమ స్థానాలను పదిలం చేసుకోవాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎంఓలో ఉన్న అధికారుల్లో ఒకరిద్దరిని మాత్రమే ఖచ్చితంగా కొనసాగిస్తారని.. మిగిలిన వారి స్థానాల్లో మార్పు తప్పదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొందరి పనితీరుపై పత్రికల్లో పతాక స్థాయిలో కథనాలు రావడంతో ఐఏఎస్‌ బదిలీల్లో ఏం జరుగనుందనే ఆసక్తి నెలకొంది.



Politent News Web4

Politent News Web4

Next Story