ఆంధ్రప్రదేశ్‌ లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుల అరెస్టులు కొనసాగుతున్నాయి. బడా బడా నేతలు అరెస్ట్‌ అవుతుండటంతో నెక్ట్స్‌ అరెస్ట్‌ అయ్యే వరుస క్రమంలో ఎవరు ఉన్నారనే అంశంపై ఏపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు నాయకులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేసి నెలల తరబడి జైళ్ళలో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్నారు. రాజకీయ నాయకులనే కాకుండా వైసీపీ హాయంలో పని చేసిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు కూడా వివిధ కేసుల్లో అరెస్ట్‌ అయ్యి జైళ్ళలో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది వైసీపీ నేతను, సోషల్‌ మీడియా కార్యకర్తలను అరెస్టు చేసి వారిపై అనేక కేసులు పెట్టారు. ప్రస్తుతం మాజీ శాసనసభ్యుడు వల్లభనేని వంశీ, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్‌ రెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ లు పలు కేసులపై జైల్లో ఉన్నారు. వల్లభనేని వంశీ దాదాపు నాలుగు నెలలుగా జైల్లోనే ఉంటున్నాడు. ఇక మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అయితే గతంలో ఒక సారి 45 రోజుల పాటు రిమాండ్‌ లో ఉండి బెయిల్‌ పై బయటకు వచ్చాడు. మళ్ళీ రెండో సారి ఆయనపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఈ ముగ్గురు నేతలకు ఇప్పట్లో బెయిల్‌ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక సీయం కార్యాలయంలో పని చేసిన ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డి, మాజీ సీయం ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డిలు మధ్యం కుంభకోణంలో అరెస్ట్‌ కాగా మాజీ ఇంటెలిజెన్స్‌ ఛీఫ్‌ డీజీపీ స్ధాయి అధికారి అయిన పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుని అరెస్ట్‌ చేసి ఆయనపై రెండు కేసులు పెట్టారు.

ఇదంతా ఒక ఎత్తైతే ఇక ముందు వైసీపీ నాయకులు ఎవరెవరు అరెస్ట్‌ అవుతారనే విషయంపై రాష్ట్రంలో పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఆర్కేరోజా, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్‌ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరు కాకుండా ఇంకా చాలా మంది నాయకుల పేర్లు రెడ్‌ బుక్‌ లో ఉన్నాయని కొంచెం ఆలశ్యమైనా పుస్తకంలో పేరున్న నేతలందరూ అరెస్ట్‌ కాకా తప్పదని అధికార వర్గాలు చెపుతున్నాయి. అయితే తాము అరెస్ట్‌ అవుతామన్న అనుమానం ఉన్న కొందరు నేతలు ముందస్తు బెయిల్ పొందారు. ముందస్తు బెయిల్ దక్కని వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు జూన్ భయం పట్టుకుంది. ఈ నెలలో కీలక అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. పక్కా ఆధారాల సేకరణలో కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని త్వరలోనే కీలక నేతల అరెస్టులు ఉంటాయని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.

ముఖ్యంగా మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో సూత్రధారిగా పరిగణిస్తున్న రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరుడు అరెస్టయ్యారు. అటు తరువాత వైసిపి హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ కూడా అరెస్టు కాబడ్డారు. ఇంకోవైపు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లి అరెస్టు కాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందారు. అయితే జూన్లో మద్యం కుంభకోణానికి ఎండ్ కార్డు పడుతుందని.. కీలక నేతతో పాటు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది.అయితే నెల్లూరు జిల్లాలమైనింగ్ అక్రమాలకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టయ్యారు. అయితే ఆయన చాలా రోజులపాటు అజ్ఞాతంలో ఉండేవారు. న్యాయస్థానాల్లో ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో ఆయన ఇతర రాష్ట్రాల్లో గడిపే వారన్న ప్రచారం ఉంది. ఈ తరుణంలో కేరళలో ఉన్న గోవర్ధన్ రెడ్డిని ఏపీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంకోవైపు మాజీ మంత్రి కొడాలి నాని కి లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. విదేశాలకు పారిపోకుండా అన్ని ఎయిర్పోర్టులకు, పోర్టులకు కేంద్ర హోం శాఖ లుక్ అవుట్ నోటీసులు జారీచేసింది. ఆయన అరెస్టు ఖాయమని ప్రచారం జరుగుతోంది. పల్నాడు జిల్లాలో జంట హత్యలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి సోదరుల హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తూ కేసు నమోదు చేశారు. వారి అరెస్టు ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు బియ్యం మాఫియాకు సంబంధించిన కేసులో మాజీమంత్రి పేర్ని నాని చుట్టూ కూడా పుచ్చు బిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ అరెస్టులు, కేసుల నమోదు విషయంలో కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. కేసుల్లో నిందితులకు న్యాయస్థానాలను ఆశ్రయించే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వారి అరాచకాలను ఆధారాలతో సహా న్యాయస్థానాలు ముందు ఉంచాలని కూడా కసరత్తు చేస్తోంది. తద్వారా వారు నిజంగా తప్పు చేశారని. తాము ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు దిగలేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికైతే వైసీపీ నేతలకు జూన్ గండం అయితే మాత్రం ఉందని తెలుస్తోంది. మరి ఎంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి.

Politent News Web 1

Politent News Web 1

Next Story