Della Vasudhaika Kutumbam International Township: పవిత్ర నగరం తిరుపతిలో భారీ అంతర్జాతీయ టౌన్‌షిప్‌ నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ‘డెల్లా వసుధైక కుటుంబ అంతర్జాతీయ టౌన్‌షిప్‌’ పేరుతో డెల్లా టౌన్‌షిప్స్‌ సంస్థ ఈ మెగా ప్రాజెక్టును చేపట్టనుంది. సుమారు 1,400 ఎకరాల విస్తీర్ణంలో రూ.35 వేల కోట్ల పెట్టుబడితో ఈ టౌన్‌షిప్‌ అభివృద్ధి చేయనున్నారు. హిందూ సంస్కృతి, సంప్రదాయాలపై ప్రపంచంలోనే మొదటి 5,000 ఏళ్ల చరిత్రను జీవంతంగా ప్రదర్శించే ‘లివింగ్‌ ఎగ్జిబిషన్‌’ ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

డిజైన్‌ ఫ్యూచరిస్ట్‌గా పేరొందిన డెల్లా టౌన్‌షిప్స్‌ వ్యవస్థాపకుడు జిమ్మీ మిస్త్రీ సారథ్యంలో ఈ ప్రాజెక్టు రూపొందనుంది. ఇది పూర్తయితే సుమారు 20 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ముఖ్యంగా స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కేటాయించేందుకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

విశాఖపట్నంలో ఇటీవల జరిగిన పెట్టుబడుల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో డెల్లా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ), రాష్ట్ర పర్యాటక శాఖల సహకారంతో ఈ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ నిర్వాహకులు వెల్లడించారు.

ప్రాజెక్టు ప్రత్యేకతలు:

హిందూ మతానికి చెందిన వివిధ జ్ఞాన పరంపరలు, సంప్రదాయాలు, ఆచారాలను దేశవ్యాప్తంగా ఏకీకృతం చేయడమే ముఖ్య ఉద్దేశ్యం.

300 ఎకరాల్లో ‘లివింగ్‌ ఎగ్జిబిషన్‌’ ఏర్పాటు. ఇందులో 25 పెవిలియన్లు ఉంటాయి – ప్రతి ఒక్కటి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో.

సింధూ నాగరికత నుంచి ఆధునిక హిందూ తత్వచింతన వరకు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపకల్పన.

వేద విజ్ఞానం, శాస్త్రీయ కళలు, ఆలయ శిల్పకళ, ప్రాంతీయ సంప్రదాయాలు ప్రదర్శనలో భాగం.

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమ పెవిలియన్ల రూపకల్పనలో పాల్గొనాలని ఆహ్వానం.

లివింగ్‌ ఎగ్జిబిషన్‌తో పాటు విలాసవంతమైన నివాస గృహాలు, ప్రైవేట్‌ విల్లాలు, 600కు పైగా గదులతో ఫైవ్‌స్టార్‌ రిసార్టులు, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వేదికలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ టౌన్‌షిప్‌ తిరుపతిని ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో మరింత ప్రముఖంగా నిలపనుంది. హిందూ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక సౌకర్యాలతో ముందుకు తీసుకెళ్లే ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఒరవడి ఇవ్వనుంది.

Next Story