యోగా డే గ్రాండ్ సక్సెస్ - చంద్రబాబు
యోగాంధ్ర నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసిన సీయం

విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం విశాఖ ఆర్కే బీచ్ లో యోగాంధ్ర వేడుకలు మగిసిన తరువాత సీయం చంద్రబాబు విశాఖ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో విశాఖ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహించిన తీరుపై చర్చించారు. ఈ యోగా డే వేడుక సందర్భంగాపలు ప్రపంచ రికార్డులు సాధించడంపై మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, ఉద్యోగులను సీయం అభినందించారు. ప్రజల భాగస్వామ్య, అన్ని విభాగాల సమన్వయంతో యోగాడే గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీయం చంద్రబాబు అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకుని పని చేసినందుకు వారిని అభినందించారు. మూడు లక్షల మందికి పైగా విశాఖ యోగ సాధనలో పాల్గొనడం పట్ల సీయం హర్షం వ్యక్తం చేశారు. పాల్గొన్న వారి సంఖ్య లెక్కింపుల క్యూఆర్ కోడ్ మంచి ఫలితాన్ని ఇచ్చిందని మంత్రులు అనగా, ఈ కార్యక్రమానికి అర్ధరాత్రి 2 గంటల నుంచే ప్రజలు తరలి రావడం పట్ల పలువురు అధికారులు ఈ సమావేశంలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
