నోటి దూల నేతలతో వైసీపీకి కష్టాలు

నోరా వీపుకు చేటు తేకే అనే ఒక తెలుగు సామెత ఉంది. ఇప్పుడు దాన్ని నోరా పార్టీకి చేటు తేకే అని మార్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి చూస్తే ఇప్పుడు అందరూ నోరా పార్టీకి చేటు తేకు అనే అంటారు. ఎన్నో ప్రతిబంధకాల మధ్య పురుడు పోసుకున్న వైఎస్ఆర్సీపీ మరెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని కూడా చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పురుడు పోసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్ధానం ప్రారంభించిన నాటి నుంచి అంతులేని జనాదరణ పొందింది. ఈ కారణంగానే రాష్ట్ర విభజన తరువాత 201లో జరిగిన ఎన్నికల్లో 64 సీట్లు సాధించి శాసనసభలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో ఏపీ ప్రజలు 151 సీట్లలో వైసీపీని గెలిపించి భారీ మ్యాండేట్ ఇచ్చారు. అయితే వచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని కొంత మంది నాయకుల నోటి దూల కారణంగా రెండో సారి దక్కించుకోలేకపోయారనేది అంగీకరించాల్సిన వాస్తవం.
వైఎస్ఆర్సీపీ 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆపార్టలోని పలువురు నేతలు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీపై పరుష పదజాలంతో మాటల యుద్దం ప్రారంభించారు. వాస్తవానికి అంతకు ముందే టీడీపీ నాయకులు, సోషల్ మీడియా టీమ్లు వైసీపీ నాయకులను ముఖ్యంగా మహిళా నాయకురాళ్ళను వ్యక్తిగతంగా దూషించడం, కించపరుస్తూ విమర్శలు చెయ్యడం చేస్తున్నప్పటికీ వారి మీడియా బలంతో వైసీపీ నాయకులు చేసిన బూతు కామెంట్లే బాగా ప్రచారంలోకి వచ్చేవి. ఒక మంత్రులుగా ఉన్న కొడాలి నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ వంటి నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై చేసిన బోల్డ్ కామెంట్లు ప్రజల్లో వారినే కాక వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి కూడా చేటు చేశాయి. పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ పై వాడిన పదజాలం, వైసీపీ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మాట్లాడిన దారుణమైన మాటలు వెరసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బూతుల పార్టీగా ముద్ర వేయడంలో టీడీపీతో పాటు ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా విజయవంతం అయ్యింది. ఇదే సమయంలో పార్టీ అధిష్టానం కూడా ఈ మంత్రులు, నాయకులు మాట్లాడుతున్న బూతుల భాషను అడ్డుకునే ప్రయత్నం ఎక్కడా చేసినట్లు కనిపించలేదు. దీంతో అదేదో ప్రోత్సాహంలా భావించి కొంతమంది నేతలు మరింత రెచ్చిపోయి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై కూడా ఏహ్యంగా మాట్లాడారు. ఇదే పార్టీ మీద ప్రజల్లో ఏవగింపు తెచ్చిందనేది పరిశీలకుల అంచనా.
ఇక తాజాగా తీసుకుంటే అమరావతిని ఉద్దేశించి సాక్షి టీవీలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలు మళ్ళీ ఆ పార్టీ తలకే చుట్టుకున్నాయి. టీడీపీ మీడియా సమర్ధవంతంగా కృష్ణంరాజు చేసిన జుగుప్సాకర వ్యాఖ్యలను వైసీపీ పార్టీకి ఆపార్టీ అధినేత వైఎస్జగన్మోహనరెడ్డి, సాక్షి చైర్పర్సన్ వైఎస్.భారతిలకు అంటగట్టడంలో సక్సెస్ అయ్యారు. ఈ మధ్య కాలంలో ప్రజల్లోకి వెళుతూ, జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం అంటూ ప్రభుత్వానికి వ్యతిరేంగా 175 నియోజకవర్గాల్లో చేసిన ఆందళనలతో వైసీపీ మంచి ఫామ్లోకి వచ్చింది. ఈ సమయంలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన నీచమైన వ్యాఖ్యలు మళ్లీ వైసీపీని డిఫెన్స్లో పడేసిన పరిస్ధితి నెలకొంది. వైసీపీ సంస్కారహీనుల పార్టీ అని టీడీపీ ఏదైతే ముద్ర వేయాలని చూస్తోందో దానికి ఆ పార్టీకి చెందిన నేతల నోటి దూల మరింత బలం చేకూరుస్తోంది. అఖరికి విశ్లేషకుల నోటి నుంచి వచ్చిన పరుష పదాలను తమ పార్టీకి అంటగడుతుంటే కూడా తిప్పికొట్టే మెకానిజం వైఎఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోవడం ఆ పార్టీని మరింత నష్టపరుస్తోంది. ఆదిలోనే మంత్రులు ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులను కూడా లాగా తిడుతుంటే పార్టీ అధినాయకత్వం తప్పుపట్టకుండా చోద్యం చూస్తున్నట్లు చూడటం ఇప్పుడు కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్లు అయ్యింది. పార్టీ సొంత ఛానల్ కి వచ్చే విశ్లేలషకలకు కూడా నోటికి అదుపు లేకుండా మాట్లాడే పరిస్ధితి తలెత్తింది. ఇప్పటికైన వైసీపీ ఈ బూతు ముద్ర నుంచి బయటపడకపోతే సమాజంలో చాలా వర్గాలు ఆ పార్టీకి ఎప్పటికీ దూరంగానే ఉంటాయనడంలో సందేహం లేదు.
