Maruti Jimny : థార్ కు పోటీగా వచ్చిన ఎస్యూవీకి విదేశాల్లో భారీ డిమాండ్.. లక్ష దాటిన అమ్మకాలు
లక్ష దాటిన అమ్మకాలు

Maruti Jimny : భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఆఫ్-రోడర్ SUV లలో ఒకటైన మహీంద్రా థార్కి పోటీగా జూన్ 2023న లాంచ్ అయిన మారుతి జిమ్నీ అద్భుతాలు సృష్టిస్తోంది. ఏప్రిల్ 2025 చివరి నాటికి మారుతి జిమ్నీ మొత్తం 102,024 యూనిట్లను విక్రయించింది. ఈ లైఫ్స్టైల్ ఆఫ్-రోడర్ జిమ్నీని భారతీయ మార్కెట్ కంటే విదేశాల్లోనే ఎక్కువ మంది కొనుగోలు చేశారు. దేశీయ మార్కెట్లో కేవలం 26,180 యూనిట్లు మాత్రమే అమ్ముడవగా, మారుతి 75,844 యూనిట్ల జిమ్నీలను ఎగుమతి చేసింది. అత్యధిక వాహనాలను జపాన్కు పంపారు.
మారుతి జిమ్నీని మొదటిసారిగా ఆటో ఎక్స్పో 2023లో ప్రదర్శించారు. దీనిని భారతదేశంలో జూన్ 7, 2023న విడుదల చేశారు. ఆఫ్-రోడింగ్, అడ్వెంచర్ వాహనాలను ఇష్టపడే వారిని ఆకర్షించడమే దీని ఉద్దేశ్యం. జిమ్నీ ఒక బాడీ-ఆన్-ఫ్రేమ్ 4x4 SUV, దీనిని ప్రత్యేకంగా ఆఫ్-రోడింగ్ కోసం రూపొందించారు. దీని త్రీ డోర్స్ మోడల్ ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులారిటీ పొందింది. ముఖ్యంగా దాని డిజైన్, స్ట్రాంగ్ ఆఫ్-రోడింగ్ కెపాసిటీ కారణంగా. భారతదేశంలో మహీంద్రా థార్ విజయాన్ని దృష్టిలో ఉంచుకొని, మారుతి సుజుకి కూడా ఇలాంటి ప్రత్యేక SUVని తన ప్రీమియం నెక్సా షోరూమ్ల ద్వారా రిలీజ్ చేసింది.
భారతదేశం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన 5 డోర్స్ జిమ్నీ అసలు మోడల్ కంటే కొంచెం పొడవుగా ఉంటుంది. ఇందులో నలుగురు సులభంగా కూర్చోవచ్చు. భారతదేశం వంటి బడ్జెట్ మార్కెట్లో ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఈ చర్య తీసుకున్నారు. ఈ SUV మారుతి సుజుకి గురుగ్రామ్ ప్లాంట్లో తయారవుతుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ SUVకి ప్రధాన తయారీ కేంద్రం.
జిమ్నీలో 1.5 లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 105 హార్స్పవర్, 134 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ లభిస్తుంది. మారుతి ఇతర వాహనాలలో కొత్త K15C ఇంజిన్ వస్తుండగా, జిమ్నీలో ఇప్పటికీ పాత K15B ఇంజిన్ ఉపయోగించబడుతోంది. కంపెనీ ప్రకారం, మాన్యువల్ వెర్షన్ మైలేజ్ లీటరుకు 16.94కిమీ, ఆటోమేటిక్ వెర్షన్ మైలేజ్ లీటరుకు 16.39 కిమీ.
ఆటో ఎక్స్పోలో ప్రదర్శించినప్పటి నుండి విడుదల వరకు 5 నెలల్లో జిమ్నీకి 30,000 కంటే ఎక్కువ బుకింగ్లు లభించాయి. అయితే మార్కెట్లో ఆశించినంతగా అమ్మకాలు జరగలేదు. జిమ్నీ ఒక నిజమైన ఆఫ్-రోడ్ వాహనం, చాలా తేలికైనది కూడా, కానీ దాని చిన్న సైజ్, పవర్ ఫుల్ SUVని కోరుకునే వారికి నచ్చలేదు. మారుతి జిమ్నీ బేస్ మోడల్ ధర రూ.12.76 లక్షల నుండి ప్రారంభమై, టాప్ మోడల్ ధర రూ.14.97 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్). మరోవైపు, 5-డోర్ల మహీంద్రా థార్ రాక్స్ ధర రూ.12.99 లక్షల నుండి ప్రారంభమై, టాప్ మోడల్ ధర రూ.23.39 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వెళ్తుంది.
