Hyundai Creta : ఏడాదిలో 2 లక్షల కార్ల సేల్స్..ప్రతిరోజూ 550 మంది ఇంటికి చేరుతున్న హ్యుందాయ్ కారు
ప్రతిరోజూ 550 మంది ఇంటికి చేరుతున్న హ్యుందాయ్ కారు

Hyundai Creta : హుండీ మోటార్ ఇండియా తన పాపులర్ ఎస్యూవీ హ్యుందాయ్ క్రెటాతో సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఏడాదిలో ఈ కారు ఏకంగా 2 లక్షల యూనిట్ల విక్రయాలను దాటి, భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మిడ్-సైజ్ ఎస్యూవీగా తన రికార్డును మరింత సుస్థిరం చేసుకుంది. పోటీ పెరుగుతున్నా, క్రెటా తన హవాను ఏమాత్రం తగ్గించుకోకుండా దూసుకుపోతోంది.
హ్యుందాయ్ మోటార్స్ 2025 ఏడాదిని అద్భుతమైన విజయంతో ముగించింది. ఏడాది పొడవునా సగటున ప్రతిరోజూ 550 క్రెటా కార్లు అమ్ముడయ్యాయంటే ఈ కారుకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. 2020 నుండి 2025 వరకు ఐదేళ్ల కాలంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్యూవీగా క్రెటా నిలిచింది. ప్రస్తుతం మిడ్-సైజ్ ఎస్యూవీ మార్కెట్లో క్రెటా వాటా 34 శాతం కంటే ఎక్కువగా ఉంది.
క్రెటా భారత మార్కెట్లోకి అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తయ్యాయి. 2016 నుంచి 2025 మధ్య కాలంలో ఈ బ్రాండ్ ఏటా 9 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. పదేళ్ల క్రితం కేవలం ఒక కొత్త మోడల్గా వచ్చిన క్రెటా, నేడు ప్రతి ఇంట్లోనూ సుపరిచితమైన పేరుగా మారిందని హ్యుందాయ్ ఇండియా ఎండీ తరుణ్ గార్గ్ ఆనందం వ్యక్తం చేశారు.
2025 సేల్స్ డేటాలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2020లో క్రెటా కొనేవారిలో మొదటిసారి కారు కొనేవారు కేవలం 13 శాతం ఉండగా, 2025 నాటికి అది 32 శాతానికి పెరిగింది. అమ్ముడైన కార్లలో 70 శాతం కంటే ఎక్కువ మంది సన్రూఫ్ ఉన్న వేరియంట్లనే ఎంచుకున్నారు. పెట్రోల్ కార్ల వాడకం పెరుగుతున్నా, క్రెటాలో డీజిల్ ఇంజిన్కు ఇంకా క్రేజ్ తగ్గలేదు. మొత్తం సేల్స్లో 44 శాతం డీజిల్ వేరియంట్లే ఉన్నాయి.
క్రెటా విజయంలో దాని ఇంజిన్ ఆప్షన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, పవర్ఫుల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే క్రెటా ఈవీ లాంచ్ అవ్వడం కూడా దీనికి అదనపు బలాన్ని ఇచ్చింది.

