Auto Industry : మారుతి, టాటా, మహీంద్రా మాస్టర్ ప్లాన్.. రూ.40,000 కోట్ల భారీ పెట్టుబడులు
రూ.40,000 కోట్ల భారీ పెట్టుబడులు

Auto Industry : భారతదేశ ఆటోమొబైల్ రంగం మునుపెన్నడూ లేని విధంగా భారీ వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. దేశీయంగా వాహనాల డిమాండ్ విపరీతంగా పెరుగుతుండటంతో, దిగ్గజ కంపెనీలన్నీ కలిసి ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.40,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత మార్కెట్పై నమ్మకంతో మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు రూపొందించాయి. ఈ భారీ పెట్టుబడులతో దేశీయ వాహన రంగం స్వరూపమే మారిపోనుంది.
మారుతి సుజుకి మెగా ప్లాన్
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ ఏడాది ఏకంగా రూ.14,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. సంస్థ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ కావడం విశేషం. ప్రతి ఏటా అదనంగా 5 లక్షల కార్లను తయారు చేసేలా తన ప్లాంట్లను ఆధునీకరించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం మార్కెట్లో కార్ల సరఫరా కంటే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ను తగ్గించేందుకు మారుతి ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కంపెనీ వద్ద 1.65 లక్షల కార్ల ఆర్డర్లు పెండింగ్లో ఉండటం గమనార్హం.
టాటా, మహీంద్రా ఫోకస్ అంతా ఫ్యూచర్ టెక్నాలజీపైనే
కేవలం పెట్రోల్, డీజిల్ వాహనాలే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు (EV), సాఫ్ట్వేర్, అత్యాధునిక టెక్నాలజీ కోసం టాటా మోటార్స్ రూ.33,000 నుంచి రూ.35,000 కోట్ల వరకు (వచ్చే ఐదేళ్లలో) ఖర్చు చేయనుంది. మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా (M&M) వచ్చే మూడేళ్లలో రూ.27,000 కోట్ల పెట్టుబడులతో తన ఎస్యూవీ పోర్ట్ఫోలియోను మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. యువత పెరగడం, ప్రజల ఆదాయం పెరగడం వల్ల విలాసవంతమైన కార్లకు విపరీతమైన గిరాకీ ఉంటుందని ఈ కంపెనీలు బలంగా నమ్ముతున్నాయి.
హ్యుందాయ్, హీరో మౌలిక సదుపాయాల విస్తరణ
హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఈ ఏడాది రూ.7,500 కోట్లను వెచ్చించనుంది. మహారాష్ట్రలోని తలేగావ్ ప్లాంట్లో ఉత్పత్తిని పెంచడంతో పాటు, రెండు కొత్త ఎస్యూవీ మోడళ్లను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇక టూ-వీలర్ విభాగంలో హీరో మౌటోకార్ప్ తన అత్యున్నత పెట్టుబడి ప్లాన్ రూ.1,500 కోట్లతో ముందుకు సాగుతోంది. అటు పెట్రోల్ వాహనాలతో పాటు ఇటు ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలోనూ తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని హీరో చూస్తోంది.
2030 నాటికి 60 లక్షల వాహనాల మార్కెట్
భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి, ప్రభుత్వ సంస్కరణల వల్ల 2030 నాటికి భారత ఆటోమొబైల్ మార్కెట్ ఏడాదికి 60 లక్షల యూనిట్ల మార్కును దాటుతుందని టాటా మోటార్స్ అంచనా వేస్తోంది. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత మార్కెట్ పటిష్టంగా ఉంటుందని ఆటో రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మెగా ఇన్వెస్ట్మెంట్లు పూర్తిస్థాయిలో అమలైతే, భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ హబ్గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది.

