Kia Seltos: భారత ఆటోమొబైల్ మార్కెట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ప్రపంచ దేశాల్లో లభించే అనేక ప్రసిద్ధ కార్లు మనదేశంలోనూ లభిస్తున్నాయి. అందులో ప్రముఖమైనది కియా సెల్టోస్ SUV. భారత్‌లో కొత్త జనరేషన్ సెల్టోస్ను ఈ ఏడాది జనవరిలో లాంచ్ చేశారు. చైనా మార్కెట్‌లోనూ లభించే సెల్టోస్తో పోలిస్తే పరిమాణం పరంగా రెండూ ఒకేలా ఉంటాయి. చైనా, భారతదేశాల్లో లభించే సెల్టోస్ పొడవు 4,460 mm, వెడల్పు 1,830 mm, ఎత్తు 1,640 mm కాగా, వీల్‌బేస్ 2,690 mm గా ఉంది. అయితే బూట్ స్పేస్ విషయంలో మాత్రం తేడా ఉంది. చైనా మోడల్‌లో 483 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుండగా, భారతీయ మోడల్‌లో 447 లీటర్ల కెపాసిటీ మాత్రమే ఉంది. మనదేశంలో లభించే స్పేర్ వీల్ అమరిక వల్ల ఈ వ్యత్యాసం వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు.

ఫీచర్లలో చైనా మోడల్ కాస్త ముందంజ

ఇంటిరియర్, ఫీచర్ల విషయానికి వస్తే చైనా కియా సెల్టోస్ కొంత అడ్వాన్స్‌డ్‌గా ఉంది. చైనా మోడల్ కేబిన్‌లో 27-అంగుళాల ఆల్ట్రా-వైడ్ స్క్రీన్ ఇచ్చారు. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్, ప్యాసింజర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రత్యేక స్క్రీన్‌తో పాటు డ్రైవర్ కోసం 10-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. అదే భారతీయ మోడల్‌లో ట్రినిటీ స్క్రీన్ సెటప్ లభిస్తుంది. ఇందులో డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌తో పాటు ఏసీ కంట్రోల్స్ కోసం 5-అంగుళాల చిన్న స్క్రీన్ ఉంటుంది. అంటే మన మోడల్‌లో ప్యాసింజర్ కోసం ప్రత్యేక స్క్రీన్ ఉండదు. ఇవి కాకుండా చైనా మోడల్‌లో 100 kW టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, హీటెడ్ స్టీరింగ్ వీల్, హీటెడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి. అయితే భారతదేశపు మోడల్‌లో లెవెల్-2 ADAS తో పాటు పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, బోస్ 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు లభిస్తాయి.

ఇంజిన్ పవర్ వర్సెస్ డీజిల్ ఆప్షన్

ఇంజిన్ పనితీరులోనూ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. చైనా వర్షన్ సెల్టోస్లో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు మాత్రమే ఉంటాయి. భారత్‌లో కూడా ఈ రెండు పెట్రోల్ ఇంజిన్లు లభిస్తాయి, అయితే ఇక్కడ అదనంగా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. పవర్ విషయానికి వస్తే, చైనాలోని 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 198 bhp పవర్, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కానీ భారత్‌లోని అదే టర్బో పెట్రోల్ ఇంజిన్ 158 bhp పవర్, 253 Nm టార్క్‌ను మాత్రమే ఇస్తుంది. అంటే చైనా మోడల్ మనదాని కంటే దాదాపు 40 bhp అదనపు పవర్‌ను కలిగి ఉంది.

భారత్‌కు త్వరలోనే హైబ్రిడ్ మోడల్

భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కియా కంపెనీ సెల్టోస్ హైబ్రిడ్ వర్షన్‌ను కూడా మన మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది. అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, 2027 మధ్య నుంచి చివరి నాటికి ఈ కొత్త హైబ్రిడ్ మోడల్ భారత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే చైనా సెల్టోస్ టర్బో పవర్, ప్రీమియం ప్యాసింజర్ ఫీచర్లలో ముందుండగా, భారతీయ సెల్టోస్ మైలేజ్ ఇచ్చే డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో మన మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story