Mahindra : ప్రముఖ స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వాహన ప్రియులకు గట్టి షాక్ ఇచ్చింది. తన పాపులర్ ఎస్‌యూవీల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. పెరిగిన కొత్త ధరలు జూలై 10, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్యాసింజర్ ఎస్‌యూవీ మోడళ్ల ధరలపై సగటున 2.7 శాతం వరకు, అలాగే కమర్షియల్ వాహనాల ధరలపై సగటున 2 శాతం వరకు పెంపు ఉండబోతోంది. అయితే ఈ ధరల పెరుగుదల అనేది కారు మోడల్, వేరియంట్, ఎంచుకునే కలర్ ఆప్షన్లను బట్టి మారుతుందని మహీంద్రా స్పష్టం చేసింది.

మహీంద్రా కార్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణం కార్ల తయారీకి అయ్యే ముడిసరుకు ఖర్చులు భారీగా పెరగడమే. గత కొన్ని నెలలుగా ఆటోమొబైల్ రంగానికి అవసరమైన ఇనుము, స్టీల్, ఇతర విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటివరకు ఈ అదనపు భారాన్ని కంపెనీయే భరిస్తూ వచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యయం మరింత పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భారాన్ని కస్టమర్లపై వేయాల్సి వచ్చిందని మహీంద్రా యాజమాన్యం వివరించింది. మహీంద్రా కంటే ముందే దేశంలోని పలు ఇతర ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు కూడా తమ వాహనాల ధరలను పెంచిన సంగతి తెలిసిందే.

మహీంద్రా కంపెనీ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించినప్పటికీ మార్కెట్లో వాటికి ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం భారతీయ కార్ల మార్కెట్లో మహీంద్రా ఎస్‌యూవీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా స్కార్పియో-ఎన్ , ఎక్స్‌యూవీ700, థార్ రాక్స్, సరికొత్త ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ వంటి మోడళ్లకు కస్టమర్లు బ్రహ్మరథం పడుతున్నారు. గత కొన్ని త్రైమాసికాలుగా మహీంద్రా అమ్మకాలు రెండంకెల వృద్ధితో దూసుకుపోతున్నాయి. కేవలం పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాకుండా, ఇటీవలి కాలంలో కంపెనీ లాంచ్ చేసిన సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు కూడా మార్కెట్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

కస్టమర్లకు సరికొత్త అనుభూతిని అందించడం కోసం మహీంద్రా తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన పాపులర్ ఎలక్ట్రిక్ మోడల్ XEV 9eలో సరికొత్త సినీలక్స్ ఎడిషన్‎ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్‌లో సరికొత్త రాయల్ ఎక్స్‌టీరియర్ కలర్‌తో పాటు ప్రీమియం లుక్ ఇచ్చేలా కొన్ని కాస్మెటిక్ మార్పులు చేశారు. ఇవే కాకుండా భవిష్యత్తులో మరికొన్ని సరికొత్త మోడళ్లను రోడ్లపైకి తేవడానికి మహీంద్రా వేగంగా అడుగులు వేస్తోంది.

రాబోయే రోజుల్లో భారత ఆటోమొబైల్ మార్కెట్లో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయడానికి మహీంద్రా సరికొత్త కార్లను సిద్ధం చేస్తోంది. కంపెనీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విజన్ ఎస్ కాన్సెప్ట్ ఆధారిత సరికొత్త ఎస్‌యూవీని త్వరలోనే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కారు ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కెమెరాలకు చిక్కింది. దీనితో పాటు మహీంద్రా కంపెనీ తాజాగా SXT అనే సరికొత్త నేమ్‌ప్లేట్‌ను ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయించింది. దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో ఈ పేరుతో సరికొత్త పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని మహీంద్రా మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story