New SUV Launch : భారతదేశంలో మిడ్-సైజ్ ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజ్‌ను మరింత పెంచుతూ రాబోయే రెండు వారాల వ్యవధిలోనే మార్కెట్లోకి రెండు సరికొత్త పవర్‌ఫుల్ ఎస్‌యూవీలు లాంచ్ కాబోతున్నాయి. అందులో మొదటిది టాటా మోటార్స్ కి చెందిన ఎలక్ట్రిక్ వెర్షన్ కారు టాటా సియెర్రా ఈవీ కాగా, రెండవది నిస్సాన్ బ్రాండ్ నుంచి వస్తున్న మోస్ట్ అవేటెడ్ కార్ నిస్సాన్ టెక్టాన్. ఈ రెండు కార్లు కూడా మోడ్రన్ లుక్, విలాసవంతమైన ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

6 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ టాటా సియెర్రా ఈవీ

టాటా కార్ల అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వాహనం టాటా సియెర్రా ఈవీ. ఈ ఎస్‌యూవీ గత 6 సంవత్సరాలుగా డెవలప్‌మెంట్ దశలోనే ఉంది. ఎందుకంటే దీనిని మొదటిసారిగా 2020 నాటి భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలోనే కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు. ఎట్టకేలకు అన్ని రకాల టెస్టింగులను పూర్తి చేసుకుని, జూన్ 30వ తేదీన ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అధికారికంగా మార్కెట్లోకి తీసుకురావడానికి టాటా సంస్థ ముహూర్తం ఖరారు చేసింది.

ఎలక్ట్రిక్ వెర్షన్ ప్రత్యేక స్టైలింగ్

డిజైన్ పరంగా చూస్తే, ఈ కొత్త సియెర్రా ఈవీ చూడటానికి రాబోయే సియెర్రా పెట్రోల్ మోడల్ లాగే ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ కారు అని గుర్తుపట్టేలా ఇందులో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చేశారు. కారు ముందు భాగంలో బాడీ కలర్‌తో కూడిన క్లోజ్డ్ గ్రిల్ ప్యానెల్‌ను ఇచ్చారు, దాని మధ్యలో టాటా లోగో మెరిసిపోతూ ఉంటుంది. వీటితో పాటు కారు వెడల్పు మొత్తాన్ని కవర్ చేసేలా కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, బంపర్‌లో అమర్చిన రెక్టాంగ్యులర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు మరియు నిలువుగా ఉండే ఎల్‌ఈడీ ఫాగ్ ల్యాంప్స్ ఈ కారుకు ఫ్యూచరిస్టిక్ లుక్‌ను ఇస్తాయి.

19-ఇంచుల భారీ చక్రాలు.. ఐకానిక్ గ్లాస్

కారు సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. పాత సాంప్రదాయ సియెర్రా లాగే రాజసమైన లుక్, ఐకానిక్ ఆల్పైన్-స్టైల్ వెనుక క్వార్టర్ గ్లాస్‌ను ఇందులో అలాగే కొనసాగించారు. కారుకు మరింత మోడ్రన్ టచ్ ఇవ్వడానికి ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ కలర్ పిల్లర్స్, స్క్వేర్ వీల్ ఆర్చెస్, ప్రత్యేకంగా రూపొందించిన 19-ఇంచుల ఎరోడైనమిక్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. కారు వెనుక భాగంలో కూడా ఫుల్-విడ్త్ ఎల్‌ఈడీ లైట్ బార్, సిల్వర్ స్కిడ్ ప్లేట్, స్పష్టంగా కనిపించే Sierra.ev బ్యాజింగ్‌ను అందించారు.

నిస్సాన్ నుంచి వస్తున్న సరికొత్త టెక్టాన్

రాబోయే రోజుల్లో మార్కెట్లోకి రానున్న రెండవ ముఖ్యమైన ఎస్‌యూవీ నిస్సాన్ టెక్టాన్. ఈ కారు నిస్సాన్ కంపెనీకి భారతదేశంలో అత్యంత కీలకం కాబోతోంది. ఎందుకంటే 2023లో కిక్స్ ఎస్‌యూవీని నిలిపివేసిన తర్వాత నిస్సాన్ సంస్థ భారత మార్కెట్లో ఎలాంటి మిడ్-సైజ్ ఎస్‌యూవీని లాంచ్ చేయలేదు. ఇప్పుడు జూలై 9వ తేదీన ఈ టెక్టాన్ ఎస్‌యూవీని గ్లోబల్ మార్కెట్లో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

బేబీ పెట్రోల్ లుక్, ప్రీమియం కేబిన్

నిస్సాన్ టెక్టాన్ కారుకు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దాని డిజైన్. నిస్సాన్ సంస్థ దీనిని ముద్దుగా బేబీ పెట్రోల్ అని పిలుస్తోంది. ఎందుకంటే ఇది వారి గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ పెట్రోల్ ఎస్‌యూవీ డిజైన్ ఆధారంగా రూపొందింది. ఇందులో స్ప్లిట్ లైటింగ్, కనెక్టెడ్ ఎల్‌ఈడీలు, వెనుక తలుపులపై అమర్చిన సి-పిల్లర్ డోర్ హ్యాండిల్స్, సి-షేప్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ ఉంటాయి. కారు లోపల 10.1-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్, ఇన్-బిల్ట్ గూగుల్ మ్యాప్స్, లెక్టరెట్ అప్హోల్స్టరీ, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అల్ట్రా లగ్జరీ ఫీచర్లు ఉండనున్నాయి. మార్కెట్లో ఇది మిగతా మిడ్-సైజ్ కార్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story