Nissan : సొంతంగా ఒక పెద్ద కారు కొనుక్కోవాలని ఆశపడే మధ్యతరగతి కుటుంబాలకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ షాక్ ఇచ్చింది. మార్కెట్లో అత్యంత ఆదరణ పొందుతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ 7-సీటర్ కారు నిస్సాన్ గ్రావిటీ ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కారును భారత మార్కెట్లో ఈ ఏడాది, అంటే ఫిబ్రవరి 2026 లోనే లాంచ్ చేశారు. లాంచ్ చేసిన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే కంపెనీ దీని ధరలను సవరించడం గమనార్హం. ప్రారంభంలో కస్టమర్లను ఆకర్షించడానికి ఇంట్రడక్టరీ ధరలతో అందించిన నిస్సాన్, ఇప్పుడు ఆ ఆఫర్ ముగియడంతో కొత్త రేట్లను అమలులోకి తెచ్చింది.

ఏ వేరియంట్ ధర ఎంత పెరిగిందంటే?

నిస్సాన్ గ్రావిటీ కారులోని వేర్వేరు వేరియంట్లను బట్టి ధరలను రూ.8,000 నుంచి రూ.18,000 వరకు పెంచారు. ఈ మార్పుల తర్వాత నిస్సాన్ గ్రావిటీ ఎక్స్-షోరూమ్ ధరలు ఇప్పుడు రూ.5.73 లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ రూ.9.08 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో అన్నింటికంటే చౌకైన బేస్ వేరియంట్ విసియా ఎమ్‌టీ పై రూ.8,000 పెరగడంతో దీని ధర రూ.5.73 లక్షలకు చేరింది. ఇక అత్యధికంగా ఎన్-కనెక్టా ఎమ్‌టీ వేరియంట్‌పై ఏకంగా రూ.18,000 పెంచడంతో దీని కొత్త ధర రూ.7.38 లక్షలుగా మారింది. మిగిలిన చాలా వేరియంట్లపై రూ.15,000 నుంచి రూ.17,000 వరకు పెరిగింది. ఈ ఎమ్‌పీవీలో అత్యంత ఖరీదైన టాప్ మోడల్ లిమిటెడ్ లాంచ్ ఎడిషన్ ఏఎమ్‌టీ ధర ఇప్పుడు రూ.9.08 లక్షలకు చేరుకుంది.

రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త లుక్

డిజైన్ పరంగా చూస్తే, ఈ నిస్సాన్ గ్రావిటీ కారు ప్రముఖ రెనాల్ట్ ట్రైబర్ ప్లాట్‌ఫామ్‌పైనే తయారైనప్పటికీ, దీని లుక్ మాత్రం పక్కా నిస్సాన్ స్టైల్‌ను ప్రతిబింబిస్తుంది. ఈ కారు ముందు భాగంలో నిస్సాన్ సిగ్నేచర్ వి-మోషన్ గ్రిల్, ఆకర్షణీయమైన హెడ్‌ల్యాంప్స్, స్టైలిష్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, సరికొత్త బంపర్, సిల్వర్ స్కిడ్-ప్లేట్ వంటి మోడ్రన్ డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. కారు వెనుక భాగంలో, సైడ్స్ లో ప్రత్యేకంగా కనిపించేలా "Gravite" అనే బ్యాజింగ్‌ను కూడా అందించారు. ఇది రోడ్డుపై వెళ్తుంటే మంచి ప్రీమియం ఎస్‌యూవీ లుక్‌ను ఇస్తుంది.

ఫీచర్ల విషయానికొస్తే అదరహో

ఈ 7-సీటర్ ఎమ్‌పీవీ కారు లోపలి భాగం కూడా చాలా ఆధునికంగా డిజైన్ చేయబడింది. ఇందులో ప్రయాణికుల వినోదం కోసం 8 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం 7 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-టోన్ ఇంటీరియర్ కలర్ థీమ్ ఉన్నాయి. పెద్ద ఫ్యామిలీలకు అనుకూలంగా ఉండేలా దీని సీట్లను మనకు నచ్చినట్లు మడచుకునే ఆప్షన్ ఉంది. ఇవి కాకుండా కారులోని టాప్ వేరియంట్లలో వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, కేబిన్ చుట్టూ యాంబియంట్ లైటింగ్, స్వచ్ఛమైన గాలి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి లగ్జరీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

సూపర్ మైలేజ్ ఇచ్చే ఇంజిన్

నిస్సాన్ గ్రావిటీ కారులో 1.0 లీటర్, 3 సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 71 హార్స్‌పవర్, 96 Nm టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌తో పాటు కస్టమర్ల సౌకర్యార్థం 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎమ్‌టీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మైలేజ్ పరంగా చూస్తే ఈ కారు చాలా పొదుపైనది. మాన్యువల్ వేరియంట్ లీటరుకు 19.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, ఏఎమ్‌టీ ఆటోమేటిక్ వేరియంట్ ఏకంగా 19.6 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ధరలు కాస్త పెరిగినప్పటికీ, ఇప్పటికీ భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ 7-సీటర్ కారుగా నిస్సాన్ గ్రావిటీ కొనసాగుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story