Salt-Powered Scooters: త్వరలో ఉప్పుతో నడిచే స్కూటర్లు.. చైనాతో భారత్ పోటీ
చైనాతో భారత్ పోటీ

Salt-Powered Scooters: విద్యుత్ వాహనాల (ఈవీలు) ప్రజాదరణ రోజురోజుకూ పెరుగుతోంది. బ్యాటరీ టెక్నాలజీలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎక్కువ శాతం విద్యుత్ వాహనాలు లిథియం అయాన్ బ్యాటరీలతోనే నడుస్తున్నాయి. అయితే, ఇప్పుడు సోడియం అయాన్ బ్యాటరీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ రంగంలో చైనా ఎప్పటిలాగే ముందుంది. ఇప్పటికే సోడియం బ్యాటరీలతో నడిచే అనేక స్కూటర్లు ఆ దేశంలో మార్కెట్లోకి వచ్చేశాయి. తక్కువ ధర, పర్యావరణానికి హితంగా ఉండడం ఈ టెక్నాలజీ ప్రత్యేకతలు. ఈ ఉప్పుతో నడిచే వాహనాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
సోడియం అయాన్లను ఉపయోగించి ఈ బ్యాటరీలను తయారు చేస్తారు. సోడియం అయాన్లను ఉత్పత్తి చేయడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పు భూమిపై విస్తారంగా లభించే వనరు కాబట్టి, బ్యాటరీ తయారీకి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. సహజంగానే, సోడియం బ్యాటరీతో నడిచే స్కూటర్ల ధర కూడా తక్కువగా ఉంటుంది. చైనాలోని కొన్ని నగరాల్లో ఈ సోడియం చాలిత స్కూటర్లు రూ. 35,000 నుంచి రూ. 60,000 వరకు అమ్ముడవుతున్నాయి. చైనాలోని అతిపెద్ద బ్యాటరీ తయారీ సంస్థ అయిన సిఎటిఎల్ (CATL) పెద్ద ఎత్తున సోడియం బ్యాటరీలను ఉత్పత్తి చేస్తోంది. ప్రపంచం మొత్తం సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీలో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పుడు చైనా మాత్రం ఈ రంగంలో దూసుకుపోతోంది.
సోడియం అయాన్ బ్యాటరీల ప్రయోజనాలు
సోడియం అయాన్ బ్యాటరీలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి వాటిని భవిష్యత్ వాహనాలకు ఆకర్షణీయమైన ఎంపికగా మారుస్తాయి. ఉప్పు సమృద్ధిగా లభించే వనరు కాబట్టి, లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే సోడియం బ్యాటరీల తయారీ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. సోడియం అయాన్ బ్యాటరీలు చాలా త్వరగా ఛార్జ్ అవుతాయి. ఇది వినియోగదారులకు ఎంతో సౌలభ్యాన్ని అందిస్తుంది. ఈ బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఇది తరచుగా బ్యాటరీలను మార్చాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే సోడియం అయాన్ బ్యాటరీలు ఉష్ణోగ్రతల విషయంలో చాలా స్థిరంగా ఉంటాయి. దీనివల్ల ప్రమాదాల అవకాశం తక్కువ. సోడియం బ్యాటరీలలో విషపూరిత పదార్థాలు తక్కువగా ఉంటాయి. వాటిని రీసైకిల్ చేయడం సులభం.
సోడియం అయాన్ బ్యాటరీల లిమిట్స్
ప్రయోజనాలు ఉన్నప్పటికీ సోడియం అయాన్ బ్యాటరీలకు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. వాటిని అధిగమించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ సోడియం బ్యాటరీలు తక్కువ శక్తిని కలిగి ఉంటాయి. అంటే, ఒకసారి ఛార్జ్ చేస్తే వాహనం ఎక్కువ దూరం ప్రయాణించలేదు. లిథియం బ్యాటరీలతో పోలిస్తే, వీటిలో డ్రైవింగ్ రేంజ్ తక్కువగా ఉంటుంది. సోడియం అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసే టెక్నాలజీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఎక్కువ పవర్ నిల్వ చేయగల కొత్త టెక్నాలజీ భవిష్యత్తులో అభివృద్ధి కావొచ్చు.
సోడియం బ్యాటరీ టెక్నాలజీ పరిస్థితి
భారతదేశంలో కూడా సోడియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీ అభివృద్ధి దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎనర్జెటికా, జితేంద్ర ఈవీ వంటి సంస్థలు సోడియం పవర్ తో నడిచే టూవీలర్లను ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే సంవత్సరం నాటికి మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. వివిధ కంపెనీలు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు సోడియం అయాన్ బ్యాటరీ అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి.
