Electric Cars India : పెట్రోల్-డీజిల్ కార్లకు గడ్డుకాలం..భారత రోడ్లపై దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ కార్లు
భారత రోడ్లపై దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ కార్లు

Electric Cars India : ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల శకం నడుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ కార్లకు భారీగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా మన దేశంలో ఈ ఏడాది విద్యుత్ కార్ల అమ్మకాల్లో విపరీతమైన వృద్ధి కనిపిస్తోంది. 2025 జనవరి నుంచి మే నెలల మధ్య భారతదేశంలో 60,000 పైగా విద్యుత్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది 2024లో అమ్ముడైన రికార్డు సంఖ్య 99,600 యూనిట్లలో 60 శాతం. 2025 చివరి నాటికి విద్యుత్ కార్ల అమ్మకాలు తొలిసారిగా 1,50,000 మార్కును దాటే అవకాశం ఉందని అంచనా. గత ఐదు నెలల్లో విద్యుత్ కార్ల అమ్మకాలు, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 44 శాతం అధికంగా ఉన్నాయి.
టాటా అగ్రస్థానం
ఈ వృద్ధిలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొత్త విద్యుత్ కారు 'విండ్సర్ ఈవీ' పుణ్యమా అని ఎంజీ మోటార్ ఇండియా తన మార్కెట్ వాటాను రెట్టింపు చేసి 33 శాతానికి పెంచుకుంది. అయితే, టాటా మోటార్స్ వాటా 39 శాతానికి తగ్గింది. అయినప్పటికీ ఇప్పటికీ టాటానే మార్కెట్లో అగ్రగామిగా ఉంది. మహీంద్రా తన వాటాను 15 శాతానికి పెంచుకుంది. లగ్జరీ విద్యుత్ కార్ల తయారీదారులు కూడా 1,800 కంటే ఎక్కువ యూనిట్లతో..51 శాతం వార్షిక వృద్ధితో ఈ పోటీలో భాగమయ్యారు.
పెట్రోల్-డీజిల్ కార్ల అమ్మకాలు క్షీణత
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో మొత్తం ప్రయాణికుల వాహనాల మార్కెట్లో అమ్మకాలు తగ్గాయి. అయినప్పటికీ, విద్యుత్ వాహనాల విభాగం మాత్రం బలంగా వృద్ధి చెందుతోంది. 2025 ఏప్రిల్లో రిటైల్ అమ్మకాలు 13,120 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 69 శాతం ఎక్కువ. అలాగే, 2025 మే నెలలో 12,197 యూనిట్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 53 శాతం అధికంగా ఉన్నాయి.
మార్కెట్ లీడర్గా టాటా
విద్యుత్ కార్ల మార్కెట్లో అగ్రగామి అయిన టాటా మోటార్స్ 2025 జనవరి నుంచి మే వరకు 23,327 యూనిట్ల విద్యుత్ కార్లను అమ్మి అగ్రస్థానంలో నిలిచింది. అయితే, గత ఏడాదితో పోలిస్తే టాటా మోటార్స్ అమ్మకాలు 18 శాతం తగ్గాయి. 2024 జనవరి-మే మధ్య టాటా మొత్తం 28,585 విద్యుత్ కార్లను అమ్మింది. పంచ్, నెక్సన్, కర్వ్, టియాగో, టిగోర్ వంటి విద్యుత్ మోడళ్లను విక్రయిస్తున్న ఈ సంస్థ గత ఏడాదితో పోలిస్తే 5,258 తక్కువ విద్యుత్ వాహనాలను విక్రయించింది. అమ్మకాలు తగ్గడం వల్ల టాటా మోటార్స్ మార్కెట్ వాటా 69 శాతం నుంచి 39 శాతానికి తగ్గింది. టాటాకు జెఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా నుంచి పెద్ద సవాల్ ఎదురవుతోంది.
ఎంజీ మోటార్ అమ్మకాల్లో భారీ దూకుడు
'విండ్సర్ ఈవీ' విడుదలైన తర్వాత జెఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా టాటా మోటార్స్ వినియోగదారులను తమవైపు ఆకర్షించింది. జెడ్ఎస్ ఈవీ (ZS EV) మరియు కామెట్ ఈవీ (Comet EV) లను కూడా విక్రయిస్తున్న ఈ సంస్థ గత ఐదు నెలల్లో 19,636 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే 214 శాతం ఎక్కువ. గత సంవత్సరం జనవరి నుంచి మే 2024 మధ్య ఎంజీ కేవలం 6,248 విద్యుత్ కార్లను మాత్రమే అమ్మింది. ఇప్పుడు విద్యుత్ వాహనాల మార్కెట్లో జెఎస్డబ్ల్యూ ఎంజీ వాటా 15 శాతం నుంచి రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి 33 శాతానికి చేరుకుంది. ఈ పోటీ విద్యుత్ వాహన రంగంలో వినియోగదారులకు మరిన్ని మంచి ఆప్షన్లను అందిస్తుంది.
