Maruti Suzuki :దేశంలోనే అతిపెద్ద కారు తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, చిన్న కార్ల అమ్మకాలను పెంచడానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సోమవారం ప్రభుత్వాన్ని కోరింది. చిన్న కార్ల ధరలు పెరగడం వల్ల ఈ విభాగంలో అమ్మకాలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయని కంపెనీ చెబుతోంది. ఒకప్పుడు భారత ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో చిన్న కార్లదే ఆధిపత్యం. కానీ ఇప్పుడు మొత్తం ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో ఈ విభాగం వాటా 30 శాతం కంటే తక్కువకు పడిపోయింది.

చిన్న కార్ల విక్రయాలు ఎంతగా తగ్గాయంటే

రూ. 5 లక్షల లోపు ధర ఉన్న ఎంట్రీ-లెవెల్ కార్లు 2015-16 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 లక్షల యూనిట్లు (9,34,538 యూనిట్లు) అమ్ముడయ్యేవి. కానీ 2024-25లో ఇది కేవలం 25,402 యూనిట్లకు తగ్గింది. మారుతి సుజుకికి చెందిన ఆల్టో (Alto), ఎస్-ప్రెస్సో (S-Presso) వంటి మోడళ్ల విక్రయాలు మే నెలలో 6,776 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది ఇదే నెలలో ఇది 9,902 యూనిట్లుగా ఉండేది. బలేనో (Baleno), సెలెరియో (Celerio), డిజైర్ (Dzire), ఇగ్నిస్ (Ignis), స్విఫ్ట్ (Swift), వ్యాగనార్ (WagonR) వంటి కాంపాక్ట్ కార్ల విక్రయాలు కూడా మే 2025లో 61,502 యూనిట్లకు తగ్గాయి. గతేడాది ఇదే నెలలో 68,206 యూనిట్లు అమ్ముడయ్యాయి.

మారుతికి కావాల్సింది సబ్సిడీ

మారుతి సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) పార్థో బెనర్జీ ఒక ఆన్‌లైన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. "పెరిగిన నిబంధనలతో పాటు, చిన్న కార్ల మోడళ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది ద్విచక్ర వాహనాల నుంచి ఎంట్రీ-లెవెల్ కార్లకు మారాలనుకునే కొనుగోలుదారులపై ప్రభావం చూపింది" అని అన్నారు.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు

"కాబట్టి, వాహన పరిశ్రమకు ఊతం కావాలంటే సమస్య ఎక్కడ ఉందో, చిన్న కార్ల అమ్మకాలను ఎలా పెంచాలో ప్రభుత్వం అర్థం చేసుకోవాలి" అని ఆయన అన్నారు. "కారు కొనలేని కస్టమర్‌లు కూడా ద్విచక్ర వాహనం నుంచి నాలుగు చక్రాల వాహనానికి మారేలా కొన్ని ప్రోత్సాహకాలు అవసరం" అని ఆయన కోరారు.

Updated On 4 Jun 2025 10:36 AM IST
PolitEnt Media

PolitEnt Media

Next Story