Electric Cars : ఎలక్ట్రిక్ కారు రేసులో దూసుకుపోతున్న ఇండియా.. 2030నాటికి ఎన్ని కార్లకు డిమాండ్ ఉంటుందంటే ?
2030నాటికి ఎన్ని కార్లకు డిమాండ్ ఉంటుందంటే ?

Electric Cars : మన ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లు ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నాయి. ప్రస్తుతానికి అవి ఇంకా నెమ్మదిగా ఉన్నా మార్కెట్లో రాబోయే కొన్ని సంవత్సరాల్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి అని ఓ రిపోర్ట్ చెప్తోంది. రాబోయే రోజుల్లో మన దేశంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ అదిరిపోయే స్పీడ్లో పెరుగుతుందట. రోడియం గ్రూప్ అనే సంస్థ చేసిన రీసెర్చ్ ప్రకారం.. 2030 నాటికి మన ఇండియాలో ఏకంగా 25 లక్షల ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే కెపాసిటీ వస్తుందట.
ఇప్పటికి ఎంత? ఇంకో ఐదేళ్లలో ఎంత?
ప్రస్తుతం మన ఇండియాలో ఏడాదికి సుమారు 2 లక్షల ఎలక్ట్రిక్ కార్లు మాత్రమే తయారవుతున్నాయి. అంటే, ఇంకో ఐదేళ్లలో ఈ తయారీ కెపాసిటీ కనీసం 10 రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉందన్నమాట. అప్పుడు చైనా, అమెరికా, యూరప్ దేశాలు కాకుండా, ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా తయారు చేయగల దేశాల్లో మన ఇండియా కూడా ఒకటి అవుతుంది.
కార్లు తయారు చేసి అమ్ముకునే రేంజ్కి ఇండియా!
ప్రస్తుతం మన ఇండియాలో దాదాపు లక్షకు పైగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ ఉంది. 2030 నాటికి ఈ డిమాండ్ 4 లక్షల నుంచి 14 లక్షల ఈ-కార్ల వరకు పెరగొచ్చు. అంటే, అప్పటికి అదనంగా కనీసం 10 లక్షల ఎలక్ట్రిక్ కార్లు మన దేశంలోనే తయారవుతాయి. వీటిని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా దొరుకుతుంది.
అయితే, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. చైనా లాంటి దేశాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ని చాలా తక్కువ ఖర్చుతో తయారు చేస్తున్నాయి. కాబట్టి, ప్రపంచ మార్కెట్లో వాళ్ళతో పోటీ పడాలంటే, మన ఇండియా కూడా టెక్నాలజీని ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలి. లేకపోతే, చైనా కార్ల పోటీని తట్టుకోవడం కష్టమవ్వొచ్చు.
2030లో ఏ దేశం ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయొచ్చు?
రోడియం గ్రూప్ రిపోర్ట్ ప్రకారం, 2030 నాటికి వివిధ దేశాల ఎలక్ట్రిక్ కార్ల తయారీ కెపాసిటీ ఇలా ఉండొచ్చు:
చైనా: 2.9 కోట్ల కార్లు
యూరప్ యూనియన్ (EU): 90 లక్షల కార్లు
అమెరికా: 60 లక్షల కార్లు
ఇండియా: 25 లక్షల కార్లు
సౌత్ కొరియా: 19 లక్షల కార్లు
జపాన్: 14 లక్షల కార్లు
ప్రస్తుతం ఇండియాలో మహీంద్రా, టాటా, ఎంజి (MG) లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో బాగా పేరు పొందాయి. జపాన్ దగ్గర ఇప్పుడు ఏడాదికి 11 లక్షల ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే కెపాసిటీ ఉన్నా, కొన్ని కారణాల వల్ల వాళ్ళ కెపాసిటీ అంతగా పెరగదు అని అంటున్నారు.
